Israel-Iran Tensions : మిడిల్ ఈస్ట్లో టెన్షన్..టెన్షన్.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు
ఇరాన్ చేసిన డ్రోన్, మిస్సైల్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ చేసినట్లుగా అమెరికాకు సైనికాధికారులు చెబుతున్నారు.
Israel-Iran Tensions : ఇరాన్పై దాడులు జరిగాయి. ఈ అటాక్స్ చేసింది ఇజ్రాయెలే అని అమెరికా అంటోంది. ఇజ్రాయెల్ మాత్రం తాము ఇప్పుడే ఏం చెప్పలేమంటోంది. దీంతో అసలు పశ్చిమాసియాలో ఏం జరిగిందో.. జరగబోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇజ్రాయెల్ అన్నంత పని చేసినట్లు తెలుస్తోంది.
ఇరాన్లో తెల్లవారుజామున పెద్దఎత్తున పేలుడు సౌండ్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్ చేసిన డ్రోన్, మిస్సైల్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ చేసినట్లుగా అమెరికాకు సైనికాధికారులు చెబుతున్నారు. తమ దేశంపై ఏ స్థాయిలో దాడికి చేసినా.. పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని ఇజ్రాయెల్ను ఇరాన్ ప్రధాని హెచ్చరించిన తెల్లారే ఈ దాడులు జరగడం సంచలనంగా మారింది.
ఇరాన్లో అణు కార్యక్రమాలకు సెంటర్గా ఉన్న ఇస్ఫహాన్ సిటీలో భారీగా పేలుడు జరిగినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ పేలుడుకు కారణం ఏంటి.. ఇజ్రాయెల్ అటాక్ చేసిందా ఏంటనేది ఇంకా ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఎయిర్స్పేస్ను మూసివేసింది. కమర్షియల్, ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్లకు అనుమతులను రద్దు చేసింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసి.. గుర్తు తెలియని మినీ డ్రోన్లను ధ్వంసం చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంది. ఇప్పటి వరకు మూడు డ్రోన్లను కూల్చివేశామని.. క్షిపణి దాడులు జరిగినట్లు ఆధారాల్లేవని ఇరాన్ అధికారులు తెలిపారు.
సిరియాలోని ఇరాన్ ఎంబసీపై జరిగిన దాడితో..ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గొడవ స్టార్ట్ అయింది. దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ భావించింది. దానికి ప్రతీకారంగా.. ఈనెల 13న ఏకంగా ఇజ్రాయెల్పై డ్రోన్లు, మిస్పైల్స్తో అటాక్ చేసింది ఇరాన్. ఇజ్రాయెల్ కూడా అంతే దీటుగా స్పందించి.. తమ ఎయిర్ డ్రోమ్తో అన్నింటినీ కూల్చివేసింది. అంతటితో అయిపోయిందనుకున్న సమయంలో..దాడికి ప్రతిదాడి ఉంటుందని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇవ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి.
మరోవైపు ఇజ్రాయెల్పై డ్రోన్లు, మిస్సైల్స్తో అటాక్ చేసిన ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. టెహ్రాన్ డ్రోన్, క్షిపణి టెక్నాలజీని పరిమితం చేసేలా కొత్త రూల్స్ తెచ్చాయి. డ్రోన్లకు ఇంజిన్లు తయారు చేసే 16 మంది వ్యక్తులను, రెండు సంస్థలను అమెరికా విదేశీ ఆస్తుల నియంత్రణ విభాగం ఆంక్షల పరిధిలోకి తెచ్చింది. బ్రిటన్ కూడా డ్రోన్, బాలిస్టిక్ మిస్సైల్స్ తయారు చేసే సంస్థలు, వ్యక్తులనే టార్గెట్గా చేసుకుంది. ఇరాన్ను కట్టడి చేసేందుకు మరిన్ని ఆంక్షలు విధిస్తామంటోంది అమెరికా.