Summer Ploughing : వేసవి దుక్కులతో.. తగ్గనున్న పెట్టుబడులు
వర్షాలకు ముందే భూమిని దున్నడం వల్ల, తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతు దుక్కులతో భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది.
![Summer Ploughing : వేసవి దుక్కులతో.. తగ్గనున్న పెట్టుబడులు Summer Ploughing : వేసవి దుక్కులతో.. తగ్గనున్న పెట్టుబడులు](https://10tv.in/wp-content/uploads/2023/06/Summer-Ploughing.jpg)
Summer Ploughing
Summer Ploughing : ఏరు రాక ముందా… ఏరువాక ముందా ? ఏరు రాకముందే.. ఏరువాక సాగకపోతే రాజనాలు పండవురా? నీ రాజసమిక చెల్లదురా..? అన్నారు పెద్దలు. అందువల్ల నీరు వచ్చేముందే, నేల సత్తువ పెరిగేవిధంగా దుక్కులు చేసుకోవటం తప్పనిసరి. వేసవిలో దుక్కులు వల్ల భూసారం పెరగడంతో పాటు, మున్ముందు పంట దిగుబడలు గణనీయంగా పెరుగుతాయి. వేసవిలో చేపట్టే భూ యాజమాన్య పద్ధతుల వల్ల మొక్కలకు మేలు చేసే జీవ రాశులు పెరగడంతోపాటు హాని చేసే క్రిములను నిర్మూలించే అవకాశం ఉందని చెబుతున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డా. రాజేశ్వర్ నాయక్.
READ ALSO : Nutritional Elements in Fodder : అధిక పోషక విలువలు కలిగిన పశుగ్రాసాలు
పంటల సాగులో సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు పాటిస్తే సులువుగా అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ పద్దతిలో ముందుగా భూములను వేసవిలోనే దున్నకోవాలి. కానీ చాలా మంది రైతులు భూమిని దున్నకుండా వదిలేస్తారు . అలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి, భూమినిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి, భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా భూసారం తగ్గిపోవడమే కాకుండా, భూమి లోపలి పొరల నుంచి నీరు గ్రహించుకుని ఆవిరై పోయే ప్రమాదం ఉంది.
READ ALSO : Rice Varieties : అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక వరి రకాలు
కాబట్టి వర్షాలకు ముందే భూమిని దున్నడం వల్ల, తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతు దుక్కులతో భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. వేసవి దుక్కులు దున్నే ముందు పశువుల ఎరువు, కంపోస్టు ఎరువు, మట్టిని వెదజల్లడం ద్వారా సారవంతమైన పంట దిగుబడితో పాటు తేమశాతం పెరుగుతుందని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డా. రాజేశ్వర్ నాయక్.
మామూలుగా కలుపు మొక్కలు పొలంలో పెరిగి పంటలకు నష్టం కలిగిస్తుంటాయి. వాటి వేర్లు, కాయలు, గింజలు భూమిలో విస్తరించి ఉంటాయి. దీంతో నివారణ చేయడం క్లిష్టంగా మారుతుంది. పంటలు వేసే టప్పుడు పైరుతో పాటు కలుపు మొక్కలు పెరిగి పంటకు నష్టం కలిగిస్తాయి. వేసవి దుక్కులు చేయడం వల్ల ఇవ్వన్ని పెకిలించబడి అధిక ఉష్ణోగ్రతలకు నాశనమవుతాయి. వేసవి దుక్కులలో గత పంటల అవశేషాలు లేకుండ చేసి భూములను శుభ్రంగా తయారీ చేసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. ఈ విధానాలను ప్రతి రైతు పాటించాలి.