Amaravathi JAC: కేంద్ర మంత్రులు,రాజకీయ ప్రముఖులను కలిసిన అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు
బిల్డ్ అమరావతి పేరుతో ఢిల్లీకి చేరుకున్న జేఏసీ నేతలు, మహిళా రైతులు..పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులను కలిసి రాజధాని కోసం మద్దతు కోరారు
- Bharath Reddy
- Published On : April 6, 2022 / 07:13 AM IST
Amaravati
Amaravathi JAC: ఏపీ రాజధాని పరిరక్షణ సమితి ఆద్వర్యంలోని 116 మంది అమరావతి రైతు జేఏసీ నేతల బృందం రెండు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బిల్డ్ అమరావతి పేరుతో ఢిల్లీకి చేరుకున్న జేఏసీ నేతలు, మహిళా రైతులు..పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులను కలిసి రాజధాని కోసం మద్దతు కోరారు. మంగళవారం కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి, ఎంపీ సుజనాచౌదరి, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ శ్రీ తదితరులతో జేఏసీ నేతలు సమావేశం అయ్యారు. రేణుకా చౌదరిని కలిసిన జేఏసీ నేతలు..అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవర్ తో భేటీ అయ్యారు. ఈక్రమంలో రేణుక చౌదరి అమరావతి రైతుల సమస్యలను శరద్ పవార్ కి వివరించారు. ఏపీ హైకోర్టు ఇటీవల రాజధాని అమరావతి అంశంలో ఇచ్చిన తీర్పును కూడా శరద్ పవార్ కి వివరించిన రేణుక చౌదరి..రైతులు 840 రోజుల నుంచి రోడ్లపైనే ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఈసందర్భంగా అమరావతి జేఏసీ నేతలు, మహిళా రైతులతో కాసేపు మాట్లాడిన శరద్ పవార్..అసలు సీఎం జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకోవడానికి కారణం ఏంటి అని వారిని అడిగారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకున్న అనంతరం అకస్మాత్తుగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని రైతులు వివరించారు.
Also read:YS Jagan Mohan Reddy : ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం జగన్ భేటీ
అయితే చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులా? అంటూ శరద్ పవార్ ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమన్హారం. జేఏసీ నేతల విజ్ఞప్తి మేరకు పార్లమెంటులో ఏపీ రాజధాని అంశానికి తాము మద్దతిస్తామని శరద్ పవార్ భరోసా ఇచ్చారు. అనంతరం అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు కేంద్ర రైల్వే టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్,కలిశారు. తమ శాఖ పరిధిలోని అంశాలపై తప్పకుండ త్వరలోనే చర్యలు తీసుకుంటామని అశ్విని వైష్ణవ్ రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసిన జేఏసీ నేతలు ఆర్ధికశాఖ ఆద్వర్యంలోని వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్సు శాఖలకు కేటాయించిన భూముల్లో ఆయా కార్యాలయాల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని కోరారు. కేంద్రమంత్రులు నారాయణ రాణే, నరేందర్ సింగ్ తోమర్ లను కూడా కలిసిన జేఏసీ నేతలు..రాజధాని అమరావతి పరిధిలో వారి వారి శాఖలకు సంబందించిన పనులను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి కేంద్రంగా కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయాలంటూ ఎంపీలు, కేంద్రమంత్రులకు జేఏసీ నేతలు వినతిపత్రాలు అందజేశారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రులు, నేతలు సానుకూలంగా స్పందించారని రైతు ప్రతినిది మాదాల శ్రీనివాస్ తెలిపారు.
Also Read:Pawan Kalyan : 2024లో మేం అధికారంలోకి వస్తాం.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చేప్రసక్తే లేదు : పవన్
