Amaravati Padayatra: అమరావతి రైతుల పాదయాత్ర.. నేటితో ముగింపు
తిరుపతిలో అమరావతి రైతుల పాదయాత్రను రేపు ముగించనున్నారు. రేణిగుంట సమీపంలో 20 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు జేఏసీ నేతలు.
- vamsi
- Published On : December 17, 2021 / 11:25 AM IST
Amaravati
Amaravati Padayatra: తిరుపతిలో అమరావతి రైతుల పాదయాత్రను రేపు ముగించనున్నారు. రేణిగుంట సమీపంలో 20 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు జేఏసీ నేతలు. ఇవాళ(17 డిసెంబర్ 2021) మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6గంటల వరకు.. అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ జరగబోతుంది.
అమరావతి నినాదాన్ని ఎలుగెత్తి చాటేలా.. సభ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. కోర్టు ఆదేశాలకు లోబడి సభ నిర్వహిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అమరావతి రైతుల సభకు.. అన్ని ప్రధాన పార్టీల రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో పాటు ప్రజాసంఘాలనూ ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్ బాబు, నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు ఈ సభకు హాజరుకానున్నారు.
అటు అమరావతి రైతుల సభకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఈ సభ విజయవంతం అయ్యేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని అన్నారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని కోరుతూ రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
నవంబర్ 1వ తేదీన తుళ్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభం అవ్వగా.. కోర్టు అనుమతితో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. నాలుగు జిల్లాల మీదుగా 5 వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి పాదయాత్రను ముగించనున్నారు రైతులు. ఉద్యమ నేపధ్యం, రాజధాని ఆవశ్యకత, పాదయాత్ర ఉద్దేశాలను ఈ సభ ద్వారా ప్రజలకు వివరించనున్నారు.
అయితే, ఈ బహిరంగ సభ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ముందు అమతివ్వలేదు. దీంతో అమరావతి జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది
