Ambati Rambabu: అదంతా అసత్య ప్రచారం: మంత్రి అంబటి రాంబాబు
సీటు ఇవ్వకపోవడంతోనే బయటకు వెళ్లారంటూ అసత్య ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఆయనను గుంటూరు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : February 1, 2024 / 03:21 PM IST
Minister Ambati Rambabu
నర్సరావుపేట పార్లమెంట్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాజీ మంత్రి అనిల్ కుమార్ పేరును ఖరారు చేయడం హర్షించదగ్గ విషయమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంబటి మీడియా సమావేశంలో మాట్లాడారు.
బీసీలు నియోజక వర్గాల్లో సంబరాలు చేసుకుంటున్నారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. నర్సరావుపేట సీటు బీసీ వర్గానికి ఇచ్చి బీసీలకు పెద్ద పీట వేశారని అన్నారు. జగన్కు అనిల్ విశ్వాసపాత్రుడని అన్నారు. అనిల్ను అధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఆయన పార్టీని వీడటం దురదృష్టకరం
మాజీ ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు గురించి వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అంబటి రాంబాబు అన్నారు. సీటు ఇవ్వకపోవడంతోనే బయటకు వెళ్లారంటూ అసత్య ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఆయనను గుంటూరు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు.
గత ఎన్నికల సమయంలోనే శ్రీకృష్ణదేవరాయలని గుంటూరు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని తెలిపారు. ఒకవేళ ఓడిపోతే రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చారని, అయినప్పటికీ పార్టీని వీడిపోయారని చెప్పారు. ఆయన పార్టీని వీడటం దురదృష్టకరమని అన్నారు.
