Ambati Rambabu : తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరం.. ప్రభుత్వ వైఫల్యమే కారణం : అంబటి రాంబాబు
Ambati Rambabu : తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం దురదృష్టకరమని అంబటి రాంబాబు అన్నారు. మానవ తప్పిదం, ప్రభుత్వ వైఫల్యమన్నారు.
- Sreehari A
- Published On : January 9, 2025 / 04:33 PM IST
Ambati Rambabu
Ambati Rambabu : తిరుపతిలో తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం చాలా దురదృష్టకరమని అన్నారు.
గురువారం (జనవరి 9)న మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తిరుపతిలో పవిత్రమైన వైకుంఠ ద్వారా దర్శనం ప్రతీ ఏటా జరుగుతునే ఉంటుందని, ఈ పది రోజులు అక్కడి సిబ్బందికి చాలా చాలెంజింగ్ టాస్క్ అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ విషాద ఘటన జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also : TTD Stampede Incident: గేమ్ ఛేంజర్ పై ఉన్న శ్రద్ధ భక్తులపై లేదా.. రోజా సంచలన కామెంట్స్ ..
ఈ తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణం టీడీపీ చైర్మన్ ఈవో, జేఈవోలదేనని అంబటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ముగ్గురూ టీటీడీని టీడీపీలా మార్చేశారంటూ దుయ్యబట్టారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి సేవ కాకుండా చంద్రబాబు సేవ చేస్తున్నారని అంబటి విమర్శించారు.
ఇది ప్రమాదం కాదని, మానవ తప్పిదం, ప్రభుత్వ వైఫల్యమని ధ్వజమెత్తారు. వైసీపీని అణగదొక్కడానికి టీటీడీని అడ్డుకుపెట్టుకుని కుట్రలు చేశారంటూ మాజీ మంత్రి అంబటి ఆరోపణలు గుప్పించారు. పవిత్రమైన టీటీడీని రాజకీయాలకు వాడుకోవడం వల్లే ఇలాంటి ఘోరం జరిగిందని విమర్శించారు. ఇకనైనా కొండపైన రాజకీయాలు మానుకోండని, రాజకీయాలు చేస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయని హితవు పలికారు.
సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటూ అంబటి ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు కనీసం రూ. కోటి ఇవ్వాలి, గాయాలైన వారికి రూ. 25 లక్షలు ఇవ్వాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
గాయాలైన వారికి కనీసం వైద్యం అందడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈవోకి ఎస్పీకి మా వాళ్లపై కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ భక్తులకు రక్షణ కల్పించడం పైన లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
Read Also : Pawan Kalyan : తిరుపతికి బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
