AP Heat Wave
Ap weather Update: ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నా ఎండ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తీవ్ర స్థాయిలో వడగాలులతో ప్రజలు బయటకు రావాలంటేనే బెంబేలెత్తి పోతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని 112 మండలాల్లో తీవ్ర వడగాలులు, 220 మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించింది. ఇవాళ (బుధవారం) కూడా ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అదే స్థాయిలో వడ గాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు మధ్యాహ్నం సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని, బయటకు వచ్చినా వడ గాలుల భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బుధవారం 188 మండలాల్లో తీవ్ర వడగాలులు, 195 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తూర్పు గోదావరి, గుంటూరు, కాకినాడ, పల్నాడు, అనకాపల్లి, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, నెల్లూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Indian Railway: ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఆ రూట్లో పలు రైళ్లు రద్దు
రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకి మూడు రోజులు అవుతున్నా ఎండల తీవ్రత, వడగాలుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. నైరుతి రుతుపవనాలు శ్రీహరి కోట, పుట్టపర్తి ప్రాంతంలో కొనసాగుతున్నాయి. అయితే, అరేబియా సముద్రంలో తీవ్ర తుపాను బిపోర్జాయ్ కారణంగానే రాష్ట్రంలో ఎండలు, వడగాలుల తీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు తెలిపారు. రాజస్థాన్ నుంచి వీస్తున్న ఎడారి గాలుల ప్రభావమూ రాష్ట్రంపై ఉందని పేర్కొంటున్నారు. ఈ కారణంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బుధవారం కూడా పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో రెండు మూడు రోజులు ఏపీలో ఎండల తీవ్రత, వడగాలుల తీవ్ర ఎక్కువగానే ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.