CM Chandra babu : పింఛన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ.. కీలక విషయాలు వెల్లడి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ..
- Harishth Thanniru
- Published On : June 29, 2024 / 09:39 AM IST
CM Chandrababu Naidu (Photo Credit : Google)
CM Chandrababu open letter to Pensioners : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అంటూ లేఖలో బాబు పేర్కొన్నారు. చంద్రబాబు లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. అందరి మద్దతుతో మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు, ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ, ప్రథమ కర్తవ్యం. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ. 1000 పెంచి…. ఇకపై రూ.4000 ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.3000 పెంచి… ఇక నుంచి రూ.6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది.
Also Read : Dharmapuri Srinivas : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్దిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తున్నాము. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడుతున్నా.. ప్రజా శ్రేయస్సుకోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చాం. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాలకోసం నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభపెట్టింది. ఆ మూడు నెలల పాటు మీరు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి నేను చలించిపోయాను. మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి… ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మాటిచ్చాను. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా ఈ పెంపును వర్తింప చేసి మీకు అందిస్తున్నాము.
Also Read : వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశారా? పోలవరం శ్వేతపత్రంతో చంద్రబాబు అనుకున్నది సాధించారా?
మూడు నెలలకు పెంచిన రూ.3000, జూలై నెల పింఛన్ రూ.4000 కలిపి మొత్తం రూ.7000 మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆధ్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టాము. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాము. ప్రజా భద్రత మా బాధ్యత. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నానని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
