BJP leader Vishnuvardhan Reddy
AP BJP Leader: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu naidu) , కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) భేటీపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (BJP leader Vishnuvardhan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైలు ప్రమాదంలో వందల మంది చనిపోవడం హృదయ విదారకం, వారి కుటుంబాలకు దేవుడు శాంతిని కలిగించాలని కోరారు. నరేంద్ర మోడీ (Narendra Modi) తొమ్మిది సంవత్సరాల పాలనలో చేసిన పనులు చెప్పడానికి దేశవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో 20రోజుల్లో 10మంది కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పర్యటిస్తారని అన్నారు. దేశంలో మిగతా రాష్ట్రాలకంటే ఇద్దరు కీలకమైన నేతలు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.
ఈనెల 9, 10 తేదీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాయలసీమలో పర్యటిస్తారని, తిరుపతికి వచ్చి శ్రీకాళహస్తిలో జరిగే సభలో పాల్గొంటారని విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. ఏపీలో ఉత్తరాంధ్రలో అమిత్ షా పర్యటన ఉంటుందని, విశాఖలో 11న బహిరంగ సభ జరుగుతుందని అన్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తుకోసం ఇద్దరు కీలకమైన నేతలు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారని అన్నారు. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు, ఏపీ రాజకీయ మార్పులకు భారతీయ జనతా పార్టీ క్రియాశీలకంగా ఆలోచిస్తోందని విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందని, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ప్రజలకు మేలు చేయలేవని, గత తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గుర్తించారని అన్నారు.
ఏపీలో పది నెలల్లో రాజకీయ మార్పు జరగబోతోందని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు సరియైన సమయంలో బుద్ధి చెబుతారని భావిస్తున్నామని అన్నారు. ఏపీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయగల సత్తా నరేంద్ర మోడీకి, బీజేపీకి మాత్రమే ఉందని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. అమిత్ షా, చంద్రబాబు నాయుడు భేటీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ప్రధానిని, హోమ్ మంత్రిని కలవడం సాధారణంగా జరిగే ప్రక్రియ అని అన్నారు.
దేశంలో ఉన్న ప్రతిపక్ష నేతలందరూ ఏ రకంగా కలుస్తున్నారో అదే పద్దతుల్లో చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యారని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడం జరిగిందని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు, అమిత్ షా కలయిక ఏపీలో రెండు పార్టీల మధ్య పొత్తుగా అభివర్ణించడం సరికాదని అన్నారు. 11న అమిత్ షా పర్యటన, సభను అడ్డుకుంటామని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ చెప్పడం బాధ్యతారాహిత్యం అని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.