AP Cabinet Reshuffle : 7న ఏపీ మంత్రివర్గ సమావేశం.. 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణపై చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరింది. ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరిని తొలగించి కొత్తవారికి మంత్రి పదవులు ...
- Harish Thanniru
- Published on- April 4, 2022 / 12:58 PM IST
Ap Cabinet Reshuffle
AP Cabinet Reshuffle : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణపై చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరింది. ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరిని తొలగించి కొత్తవారికి మంత్రి పదవులు అప్పగిస్తానని ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుత మంత్రి వర్గంలో కొనసాగుతున్న వారిలో ఎవరుంటారు, ఎవరికి ఉద్వాసన పలుకుతారు, కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ఏపీలో కొత్త మంత్రి మండలి కొలువుదీరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 7న ప్రస్తుత మంత్రివర్గ సభ్యులతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో ఎవరు మంత్రి వర్గంలో స్థానం కోల్పోతున్నారు, ప్రస్తుతమున్న మంత్రుల్లో ఎవరు కొనసాగుతారనే దానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు.
AP Cabinet : మంత్రివర్గం ఎలా ఉంటుందో చెప్పిన సజ్జల.. కేబినెట్లో సమూల మార్పులు
ఎందుకు మంత్రి వర్గ విస్తరణ చేయాల్సి వస్తుంది, ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఉన్నవారిలో కొందరిని ఎందుకు కొనసాగించాలని అనుకుంటున్నాను అనే విషయాలపై 7న జరిగే మంత్రివర్గ భేటీలో జగన్ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. అదేరోజు మంత్రులుగా తమ పదవులను కోల్పోయిన వారు సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా పత్రాలు ఇవ్వనున్నారు. 10వ తేదీన కొత్తగా మంత్రివర్గంలో స్థానంపొందే వారికి సీఎం సమాచారం ఇవ్వనున్నారు. 11 వ తేదీన మంత్రి వర్గ విస్తరణ, అదే రోజు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
AP Cabinet: ఏపీ కొత్త కేబినెట్ ఏర్పాటుకు కౌంట్ డౌన్ మొదలు
అయితే రాబోయేది ఎన్నికల కాలం కానుండటంతో మంత్రి వర్గంలో తీసుకొనేవారి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతాలు, జిల్లాలు, కులాల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని మంత్రి వర్గంలో కొత్తవారికి అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి మంత్రి వర్గ విస్తరణలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మిగిలిన సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ మంత్రి వర్గ విస్తరణ ఉండబోతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
