AP PRC Report : పీఆర్సీపై 72 గంటల్లో సర్కారు నిర్ణయం ఉద్యోగ సంఘాల పెదవి విరుపు
పీఆర్సీ నివేదికపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 72 గంటల్లో నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చెప్పారు.
- chvmurthy
- Published On : December 13, 2021 / 07:36 PM IST
Ap Chief Secretary Sameer Sharma
AP PRC Report : పీఆర్సీ నివేదికపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 72 గంటల్లో నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చెప్పారు. ఈ రోజు సమీర్ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణలు సీఎంకు పీ ఆర్సీ నివేదికను అందచేశారు.
అనంతరం సమీర్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ…. ఫిట్ మెంట్ పై ముఖ్యమంత్రికి 7 ప్రతిపాదనలు ఇచ్చామని చెప్పారు. వివిధ రాష్ట్రాలు ఆచరిస్తున్న విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి, సెంట్రల్ పే కమీషన్ రూల్స్ను ఫాలో అవుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమీర్ శర్మ చెప్పారు. పీఆర్సీ, ఫిట్ మెంట్ అంశాలపై గడిచిన 30 ఏళ్లలో రూపోందించిన పీఆర్సీ నివేదికలను కూడా పరిశీలించినట్లు చెప్పారు.
పీఆర్సీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల మేర అదనపు భారం పడనుందని ఆయన అన్నారు.. ఈ నివేదికలో విలేజ్ సెక్రటరీలు, హోం గార్డులు,అవుట్ సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగుల గురించి కూడా నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. 2018 నుంచి పీఆర్సీ అమలవుతుందని….నివేదికను ఉద్యోగ సంఘాలకు అందచేస్తామని…ఫైనాన్స్ శాఖ వెబ్ సైట్ లోనూ నివేదిక ఉందని సమీర్ శర్మ చెప్పారు.
Also Read : Allu Arjun Fans : బన్నీ ఫ్యాన్స్పై పోలీసుల లాఠీఛార్జ్..! ఫ్యాన్స్ మీట్ రద్దు
కాగా … సమీర్ శర్మ విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలపై ఉద్యోగ సంఘాల నాయకులు పెదవి విరిచారు. తాము గడిచిన రెండేళ్లుగా 71 డిమాండ్లను ప్రభుత్వానికి అందచేస్తే వాటిలో కేవలం కొన్నిటినే ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవటం పట్ల ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. పీఆర్సీ పూర్తి నివేదిక చదివిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
