వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన సీఎం జగన్

  • Publish Date - November 9, 2020 / 07:32 PM IST

cm jagan Financial assistance : వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం (నవంబర్ 9, 2020) జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్య రజితకు జగన్ లేఖ శారు. వీర జవాన్ ప్రాణత్యాగం వెలకట్టలేనిదని సీఎం తెలిపారు.



వీర జవాన్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందని చెప్పారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.50 లక్షల అర్థికసాయం చేస్తున్నామని చెప్పారు.



జమ్మూ-కశ్మీర్‌ మాచిల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట జరిగిన ఎదురుకాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. వీరితో పాటు ఓ సైనికాధికారి, మరో బీఎస్‌ఎఫ్‌ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. చొరబాటుకు యత్నించిన ముష్కరులను అడ్డుకునే క్రమంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.



అయితే ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ప్రాణాలు కోల్పోయిన సైనికుల్లో తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన జవాను ర్యాడా మహేష్‌, ఏపీలోని చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

ఐరాల మండలంలోని.. రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రతాప్‌రెడ్డి, సుగుణమ్మల కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గత 18 సంవత్సరాలుగా మద్రాస్‌ రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. 2020, నవంబర్ 08వ తేదీ ఆదివారం జరిగిన ఎదురుకాల్పులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రాణాలు విడిచాడు. ప్రవీణ్‌ హవల్దార్‌గా పని చేస్తూ కమాండో శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రవీణ్‌కుమార్‌కు భార్య రజిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు.