Karumuri Nageswara Rao: ఏపీ మద్యం రవాణా కుంభకోణం.. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్
ఏపీ మద్యం రవాణా కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Karumuri Nageswara Rao)ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
- V Santhosh Kumar
- Published on- August 23, 2026 / 06:24 PM IST
ap former minister karumuri nageswara rao arrested in liquor scam
- మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
- రూ.195 కోట్ల కుంభకోణం ఆరోపణలు
- రంగంలోకి దిగిన ఈడీ అధికారులు
Karumuri Nageswara Rao: ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా కుంభకోణం కేసు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును(Karumuri Nageswara Rao) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కొండాపూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను బషీర్బాగ్లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. ఈ హఠాత్తు పరిణామంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు మొదలయ్యాయి.
రూ.195 కోట్ల నష్టం, కాంట్రాక్టుల్లో అక్రమాల ఆరోపణలు:
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) నిర్వహించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీగా నిధుల మళ్లింపు జరిగిందని ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. నిబంధనలను సవరించి నచ్చిన సంస్థలకే టెండర్లు దక్కేలా చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.195.33 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ క్రమంలో సుదర్శన్ కన్స్ట్రక్షన్స్కు రవాణా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు గాను సుమారు రూ.28 కోట్ల వరకు ముడుపులు అందినట్లు దర్యాప్తు సంస్థ ఆధారాలు సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
రూ.37.7 కోట్ల ఆస్తులు అటాచ్, ముమ్మరంగా ఈడీ విచారణ:
ఈ కేసులోనే ఇప్పటికే ఆయన కుమారుడు సునీల్కుమార్ను అరెస్ట్ చేసిన ఈడీ, తాజాగా కుటుంబ సభ్యులకు చెందిన రూ.37.7 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. కోకాపేట, ఖాజాగూడలోని భూములు, అనకాపల్లిలోని గ్రానైట్ క్వారీ లీజ్ హక్కులతో పాటు ఢిల్లీ, గురుగ్రామ్లోని ఖరీదైన ఆస్తులు ఇందులో ఉన్నాయి. ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ దర్యాప్తు జరుపుతున్న అధికారులు, కారుమూరిని నాంపల్లి ఈడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.
