Bopparaju Venkateshwarlu : ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు : బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఏసీబీ తనిఖీలతో ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల మొబైల్స్ స్వాధీనం చేసుకొని వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని వెల్లడించారు.
- bheemraj
- Published On : May 16, 2023 / 09:54 AM IST
Bopparaju Venkateshwarlu
Bopparaju Venkateshwarlu Criticism : ఏపీ ప్రభుత్వంపై అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శలు చేశారు. ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా, ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ ను కూడా ప్రభుత్వం వాడుకుంటుందని ఆరోపించారు. బడ్జెట్ ఇవ్వకుండా, బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం అన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తనిఖీల పేరుతో ఏసీబీ దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఆయా కార్యాలయాల్లో ఉన్నతాధికారులు లేరా? అని నిలదీశారు.
ఉద్యోగ సంఘాలు ఎప్పుడూ అవినీతిని ప్రోత్సహించవని స్పష్టం చేశారు. ఏసీబీ తనిఖీలతో ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల మొబైల్స్ స్వాధీనం చేసుకొని వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. ప్రాంతీయ సదస్సుల ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బొప్పరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
