AP Weather Alert : ఏపీకి భారీ వర్షాల ముప్పు.. 3 జిల్లాలకు రెడ్ అలర్ట్! ఎవరూ బయటకు రావొద్దు..!
AP Weather Alert : ఏపీలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ప్రత్యేకించి రాష్ట్రంలోని మూడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.. అక్కడి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- Sreehari A
- Published on- August 11, 2026 / 08:57 PM IST
AP Weather Alert
AP Weather Alert : వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ముఖ్యంగా విజయనగరం, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ప్రత్యేకించి సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచిస్తున్నారు.
ఏలమంచిలి, నర్సీపట్నం, తల్లపాలెం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్లోనూ వర్షాలు :
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు అనుకులంగా లేనప్పుడు ప్రజలెవరకూ బయటకు రావొద్దని అధికారుల సూచనలు చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావవరణ శాఖ సూచించింది.
