Ashok Gajapathi Raju: చట్టాలను, రాజ్యాంగాన్ని ప్రభుత్వం గౌరవించాలి- అశోక్ గజపతిరాజు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని ఇప్పటికైనా గౌరవించాలని కోరారు మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకులు అశోక్‌ గజపతిరాజు. మాన్సాస్‌, సింహాచలం ట్రస్టు ఛైర్మన్‌గా సంచయిత నియామక జీవోను కొట్టివేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు అశోక్‌ గజపతి రాజు.

  • Updated on- June 14, 2021 / 03:26 PM IST

Ashok Gajapathi Raju

Ashok Gajapathi Raju: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని ఇప్పటికైనా గౌరవించాలని కోరారు మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకులు అశోక్‌ గజపతిరాజు. మాన్సాస్‌, సింహాచలం ట్రస్టు ఛైర్మన్‌గా సంచయిత నియామక జీవోను కొట్టివేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అశోక్‌ గజపతి రాజు.. వివాదం జరిగి చాలా రోజులైందని.. ఎక్కడెక్కడ నష్టం జరిగిందో చూడాల్సిన అవసరం ఉందన్నారు. సింహాచలం ట్రస్ట్ పరిధిలోని ఆలయాల్లో పరిస్థితులను పరిశీలించాల్సి ఉందన్నారు.

హైకోర్టు ఉత్తర్వులతో తిరిగి మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా అయిన అశోక్ గజపతిరాజు.. దేశంలో చట్టాలు ఉన్నాయని, రాజ్యాంగం ఉందని ఈ విషయంతో రుజువైందన్నారు. సింహచలం దేవస్థానంలోని గోశాలలో గోవుల ప్రాణాలు పోయాయని, వాటిని సంరంక్షించాల్సింది పోయి వాటిని హింసించి చంపారని ఆరోపించారు అశోక్ గజపతిరాజు. వాటి ప్రాణాలు తిరిగి ఎవరు తెస్తారని ప్రశ్నించారు.

ఈ విషయంలో ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో చూడాలని, రామతీర్థం ఆలయానికి తాను విరాళం ఇస్తే తిప్పిపంపారంటూ విమర్శించారు. తాను ఛైర్మన్‌గా ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయని వాదించారని, ఏ అక్రమాలు తన వల్ల జరిగాయో చెప్పలేకపోయాని అశోక్‌ గజపతిరాజు అన్నారు. అధికారులు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని, మాన్సాస్‌ ప్రజల కోసం పుట్టిన సంస్థ అని.. తనపై పగతో ఆ కార్యాలయాన్ని తరలించాని అన్నారు. తనను ఇబ్బంది పెట్టేందుకు సామాన్యులు, ఉద్యోగులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.