Badvel Bypoll 2021: కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనా నిబంధనల ప్రకారం శనివారం (అక్టోబర్ 30) ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం బద్వేల్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బద్వేల్లో 3 గంటల వరకు 44.82శాతం పోలింగ్ నమోదైంది.
పోరుమామిళ్ల రంగసముద్రంలో కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్లో కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు.. చింతల చెరువులో బీజేపీ ఏజంట్లను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. గోపవరం మండలం బుట్టాయిపల్లి, జోగిరెడ్డిపల్లిలో బీజేపీ ఏజెంట్లను బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జిల్లా ఎస్పీ అన్బురాజన్కు ఫిర్యాదు చేశారు.
బద్వేల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీ నుంచి పనతల సురేశ్, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తున్నారు. ఈ ఉపఎన్నికకు టీడీపీ, జనసేన పోటీ చేయలేదు. నవంబర్ 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Badvel By-Election : బద్వేల్ ఉప ఎన్నిక..ఓటేసేందుకు వెళ్లిన స్థానికేతరులను అడ్డుకున్న స్థానికులు
బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాత్రి 7గంటల వరకు పోలింగ్ జరగనుంది. గతంలో కంటే అధికంగా ఓటింగ్ శాతం నమోదయ్యేలా అధికారులు ప్రజలను చైతన్యవంతం చేశారు. 2019లో 77.64శాతం ఓటింగ్ నమోదైతే.. ఈసారి 100శాతం పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ద్వేల్లో మొత్తం 281 పోలింగ్ బూత్ల్లో పోలింగ్ జరుగుతోంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ.. లైవ్ వెబ్ టెలికాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు ఎన్నికల అధికారులు. బద్వేల్ బై పోల్ లో మొత్తం 11 వందల 24 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
బద్వేల్ ఎన్నికల కోసం 15 కంపెనీల సెంట్రల్ ఫోర్స్, అదనపు బలగాలు మాత్రమే కాకుండా 2 వేల మందితో పోలీసు బందో బస్తును ఏర్పాటు చేశారు. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. వీటిలో బద్వేల్, కలసపాడు, బి.కోడూరు, ఎస్.ఎ కాశినాయన, పోరుమామిళ్ల, గోపవరం, అట్లూరు మండలాలు. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 15 వేల 292 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్షా 7 వేల 915 మంది పురుషులు ఉండగా.. లక్షా 7 వేల 355 మంది మహిళలు.. 22 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు.
Huzurabad Bypoll : ఓటేసేందుకు క్యూ కట్టిన ఓటర్లు, 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్