Bhava Kumar: నారా లోకేశ్‌తో భేటీ కానున్న వైసీపీ నేత బొప్పన భవకుమార్

కేశినేని చిన్నితో కలిసి లోకేశ్ వద్దకు వెళ్లనున్నారు భవకుమార్.

Bhava Kumar

విజయవాడ అర్బన్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. వైసీపీ నేత బొప్పన భవకుమార్ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేత నారా లోకేశ్‌తో వైసీపీ నేత బొప్పన భవకుమార్ ఇవాళ సాయంత్రం సమావేశం కానున్నారు. ఇప్పటికే భవకుమార్‌తో వంగవీటి రాధ, కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు చర్చలు జరిపారు.

లోకేశ్‌ని కలిసిన తర్వాత భవకుమార్ టీడీపీలో చేరే అవకాశం ఉంది. కేశినేని చిన్నితో కలిసి లోకేశ్ వద్దకు వెళ్లనున్నారు భవకుమార్. ఈనెల 21న భవకుమార్ టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భవకుమార్‌ను బుజ్జగించేందుకు దేవినేని అవినాశ్ సహా ఇతర వైసీపీ నేతలు రంగంలోకి దిగారు.

బొప్పన భవకుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా కొన్నాళ్లు కొనసాగారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన నామినేటెడ్‌ పోస్టుల్లో బొప్పన భవకుమార్‌కు అవకాశం దక్కకపోవడంతో ఆయన పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఇప్పటికే పలువురు నేతలు పార్టీలు మారారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి గెలుపెవరిది? బరిలోకి దిగనున్న ఆ 15మంది అభ్యర్థులు ఎవరు?