పవన్ కల్యాణ్, చిరంజీవిపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్
చిరంజీవి పక్కా కమర్షియల్.. కేంద్ర పదవి కోసం ప్రజారాజ్యం పార్టీని హోల్ సేల్గా కాంగ్రెస్కు అమ్మేశారు. పైసా కోసం ఎదైనా చేసే మనస్తత్వం వీళ్లది..
- Naga Srinivasa Rao Poduri
- Published On : April 22, 2024 / 12:37 PM IST
Bhimavaram MLA Grandhi Srinivas: జనసేన అధినేత పవన్ కల్యాణ్ భాష చూస్తే పిచ్చి బాగా ముదిరినట్టు కనబడుతోందని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భీమవరం గురించి పవన్ కల్యాణ్కు ఏం తెలుసని ప్రశ్నించారు. పవన్ మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకుని, మంచి వైద్యం చేయించాలని చిరంజీవికి సూచించారు. భీమవరంలో సీఎం జగన్ గురించి పవన్ మాట్లాడిన భాష అభ్యంతకరంగా ఉందని, ఆయన స్థాయికి తగ్గట్టు లేదన్నారు. పవన్ మాటలు వింటుంటే సానుభూతితో పాటు భయం కలుగుతోందన్నారు.
పవన్ కల్యాణ్ మంచి వ్యాపారవేత్త
పవన్ కల్యాణ్ విలువల్లేని వ్యక్తి అని.. పార్టీ పెట్టి ఎలా డబ్బులు సంపాదించాలో తెలిచిన మంచి వ్యాపారవేత్త అంటూ ఎద్దేవా చేశారు. జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేసేస్తే ఒకేసారి ప్యాకేజీ తీసుకోవచ్చని సలహాయిచ్చారు. వంగవీటి మోహన రంగాను అంతమొందించిన చంద్రబాబు లాంటి ప్రమాదకరమైన గూండాతో చేతులు కలిపారని విమర్శించారు. తన కుటుంబ సభ్యులను తిట్టించిన చంద్రబాబుతో పవన్ అంటకాగుతున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ మానసిక స్థితి బాగాలేదని, మానసిక ఆరోగ్యం కుదుటపడటానికి తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాలని హితవు పలికారు.
Also Read: టీడీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు.. చంద్రబాబు, లోకేశ్ ప్లెక్సీలను తగలబెట్టిన కార్యకర్తలు
చిరంజీవి పక్కా కమర్షియల్
పవన్ కల్యాణ్ను కాకా పట్టడానికే జనసేన పార్టీకి చిరంజీవి 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారని గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. తన సినిమాలకు ఓపెనింగ్ రావన్న భయంతోనే తమ్ముడిని కాకాపడుతున్నారని, పైసా కోసం ఎదైనా చేస్తారని అన్నారు. కేంద్ర మంత్రి పదవి తీసుకుని ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి హోల్ సేల్గా కాంగ్రెస్కు అమ్మేశారని దుయ్యబట్టారు. తన అన్నయ్యలా జనసేన పార్టీని టీడీపీలో కలిపేసి ఉంటే బాగుండేదన్నారు.
