బీజేపీ అగ్ర నాయకత్వంతో మిథున్ రెడ్డి సంప్రదింపులు: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
BJP MLA Adinarayana: తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిథున్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : June 21, 2024 / 04:53 PM IST
BJP MLA Adinarayana about Mithun Reddy
అమరావతిలోని అసెంబ్లీ లాబీల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అగ్ర నాయకత్వంతో మిథున్ రెడ్డి సంప్రదింపులు జరిపారని అన్నారు. ఏపీలో వైసీపీ ఖాళీ అవుతుందని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. బీజేపీ అంగీకరిస్తే అవినాశ్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని తెలిపారు.
అయితే, బీజేపీ నాయకత్వం వద్దని అంటోందని చెప్పారు. అయినప్పటికీ చేరతామంటూ మిథున్ రెడ్డి ఇంకా సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిథున్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.
మంత్రి రాంప్రసాద్ రెడ్డి కామెంట్స్
మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను బీజేపీ చేర్చుకోదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకనాధ్ వంటివారు బీజేపీ చేరటం కాదని, వారంతా చేసిన పాపాలకు శాశ్వతంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకే వెళ్తారని తెలిపారు. జైలుకు వెళ్లకుండా పెద్దిరెడ్డి తప్పించుకోలేరని అన్నారు. త్వరలో సాక్షాధారాలతో పెద్దిరెడ్డి బాగోతం బయటపెడతామని చెప్పారు. ఆయన కుటుంబం చేసిన దురాగతాలపై విచారణ జరిపిస్తామన్నారు.
Also Read: పోచారం నివాసం వద్ద అరెస్టయిన బాల్క సుమన్, ఇతర నేతలపై కేసులు.. వైద్య పరీక్షలు పూర్తి..
