BJP MLC PVN Madhav : జనసేన పొత్తుపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు గురించి పవన్ కల్యాణ్ ను కలిసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. వైసీపీతో బీజేపీ కలిసుందని జరిగిన ప్రచారంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందిందన్నారు మాధవ్. జనసేన మాకు ప్రచారం చేసుంటే రిజల్ట్ ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కలిసి పనిచేయక పోవడం వల్లే ఓటమి చెందామన్నారు. సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా వస్తుంటే జనసేన ఖండించలేదన్నారు. జనసేన అధినేత పవన్ ను వ్యక్తిగతంగా కలిశాం.. అయినా సపోర్ట్ చేయలేదు.. ఏం అభ్యంతాలున్నాయో మాకు తెలియదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ మాధవ్.
” ప్రభుత్వ వ్యతిరేక ఓటు, మా రెండవ ఓటు టీడీపీకే వేశారు. ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ప్రజల్లో మార్పు వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జనసేన-బీజేపీ కలిసి పని చేయాలి. అప్పుడే వైసీపీ ఓటు చీలదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వమని కోరలేదనేది అసత్యం. నేను, పార్టీ అధ్యక్షుడు అడిగాం. ఫోన్ లోనూ పలుమార్లు మాట్లాడాం. జనసేన-బీజేపీ పొత్తు ప్రకటనలకే పరిమితం. ఎక్కడా కలిసి పని చేసింది లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు.. పోరాటాలు చేసినప్పుడు కలిసి పనిచేస్తేనే ప్రభంజనం” అని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.(BJP MLC PVN Madhav)
Also Read..Pithapuram Assembly constituency: పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నారా?
”ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై పదాధికారుల సమావేశంలో చర్చించాం. బీజేపీకి గతంలో కన్నా మెరుగైన ఓట్లు పెరిగాయి. రాబోయే కాలంలో పార్టీ బలోపేతంపై చర్చించాం. జనసేనతో కలిసి ఉన్నా లేనట్లే అనే భావన ఉంది. క్షేత్రస్ధాయిలో కలిసి పని చేయాలనే కోరుతున్నాం. ఏప్రిల్ 1 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా కార్యక్రమాల్లో భాగంగా ఏపీలోనూ అభియాన్ నిర్వహిస్తున్నాం.
అధికార వైసీపీతో.. బీజేపీ దోస్తీ చేస్తుందని అధికార పార్టీ ప్రచారం చేస్తోంది. ఇది అవాస్తవం. వైసీపీపై పెద్దఎత్తున పోరాటాలు చేస్తున్నా అధికార పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. అధికార పార్టీ అక్రమాలను ఎండగడతాం. స్ట్రీట్ కార్నర్ ద్వారా వైసీపీని ప్రజల్లో నిలదీస్తాం. మే 1 తర్వాత మండల, అసెంబ్లీ, జిల్లా స్ధాయిలో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపై చార్జిషీట్ నమోదు చేయాలని నిర్ణయించాం. బహిరంగ సభలు నిర్వహిస్తాం. బీజేపీ తనంతట తానే పెరగాలని భావిస్తుంది. ఏ నిర్ణయమైనా కేంద్రమే తీసుకుంటుంది.
ఉత్తరాంద్ర ఎన్నికల్లో ఓటమికి కారాణాలను గుర్తించాం. వైసీపీకి బీజేపీ మద్దతు అని ప్రచారం చేశారు. బీజేపీకి ఓటేసినా వైసీపీకి ఓటేసినట్లేనని భావించేలా ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను జనసేన ఖండించ లేదు. జనసేన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడా పాల్గొన లేదు. మా సొంత ఓటింగే నమోదైంది. జనసేన.. పొత్తు ఉన్నాం అంటోంది. మేము ఉన్నామంటే ఉన్నాం అంటున్నాం.
బీజేపీ ప్రజాపోరుపై జనసేన రావాలి. వాళ్లు కార్యక్రమాలు చేస్తే మేము వెళతాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్ధతివ్వమని పవన్ ను కోరాం. అయినా స్పందించలేదు. అమరావతి విషయంలో స్పష్టతతో ఉన్నాం. జనసేన, బీజేపీ కలిసి వెళ్తే ప్రభంజనం సృష్టిస్తాం. పవన్, మనోహర్ ఇద్దరినీ సపోర్ట్ చేయమని బహిరంగంగా అడిగాం. కలిసి అడిగాం. కానీ స్పందించలేదు. మా రెండో ప్రాధాన్యత ఓటు అధికార పార్టీపైన కోపంతో టీడీపీకి పడింది. జనసేన, టీడీపీ కలిసి పని చేసిందని అనిపించడం లేదు. కానీ ఓట్లు పడ్డాయి” అని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.