పెట్రోల్ ధరలపై Chandrababu పోరుబాట.. 9న ఆందోళనలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈసారి పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పెట్రోలు ధరలు కనీసం రూ.16 తగ్గించి తీరాలని చంద్రబాబు
- Naveen
- Published On : November 6, 2021 / 04:45 PM IST
Chandrababu Naidu
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈసారి పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పెట్రోలు ధరలు కనీసం రూ.16 తగ్గించి తీరాలని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఈ నెల 9న అన్ని పెట్రోల్ బంకుల దగ్గర ఆందోళనలు చేపడతామని చెప్పారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ఈ ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పెట్రోలు ధరలు తగ్గించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
అధికారంలోకి వస్తే పెట్రోలు రేట్లు తగ్గిస్తామని జగన్ చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించిన తర్వాత దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్రోలు ధరలు తగ్గించాయని, ఏపీలో మాత్రం తగ్గించలేదని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పెట్రోలు ధరలపై జగన్ ఆందోళన చేశారని చంద్రబాబు అన్నారు. అధికారం చేతిలో ఉందని జగన్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
Obesity medicine : ఊబకాయం తగ్గించే ఇంజెక్షన్..ఎగబడుతున్న జనాలు..
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పెట్రోల్ ధరల విషయంలో కేంద్రం స్పందించింది. ప్రజలకు స్పల్ప ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేసింది. దీంతో ఇంధన ధరలు తగ్గాయి. పలు రాష్ట్రాలు కేంద్రం బాటలో పయనించాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా తగ్గించాయి. దీంతో.. ఇప్పుడు తగ్గించని రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా ఒకటి. ఈ క్రమంలో పెట్రో ధరలపై టీడీపీ పోరాటానికి సిద్ధమైంది.
కేంద్రం డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించినా.. ఏపీలో తగ్గించడం లేదని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో కంటే చాలా రాష్ట్రాల్లో చమురు ధరలు తక్కువేనని గుర్తుచేసిన ఆయన.. దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు చంద్రబాబు. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించగానే చాలా రాష్ట్రాలు కూడా తమ పరిధి మేరకు ధరలు తగ్గించాయని.. కానీ, ఏపీలో ధరలెందుకు తగ్గించరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ladyfinger : రక్త సరఫరా మెరుగు పరిచి…శ్వాసకోశ సమస్యల్ని దూరం చేసే బెండకాయ
అధికారం ఉంది కదా అని బాదుడే బాదుడా..? అంటూ నిలదీసిన ఆయన.. పెట్రో ధరలు పెరిగితే పరిశ్రమలు, వ్యవసాయం కష్టంగా మారతాయని, నిత్యావసర ధరలు పెరుగుతాయని వాపోయారు. రెండున్నరేళ్లల్లో ఓ పక్క విధ్వంసం.. మరో పక్క నిత్యావసరాలపై బాదుడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. పెట్రోల్పై రకరకాల పన్నులు వేయడం ద్వారా ప్రజల నుంచి అత్యధికంగా డబ్బు వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్దే అగ్రస్థానమని, డీజిల్పై అత్యధిక పన్నులు విధించే విషయంలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో పెట్రోల్ పై రూ.16, డీజిల్ పై రూ.17 వ్యాట్ తగ్గించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చంద్రబాబు. ఇందులో భాగంగా ఈ నెల 9న ఆందోళనలకు పిలుపునిచ్చారు. దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధరలున్న ఆంధ్రప్రదేశ్ లో వ్యాట్ తగ్గించాలన్నది టీడీపీ డిమాండ్.
