Kesineni Nani : చంద్రబాబు అరెస్ట్ కేసు.. ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్
చంద్రబాబుకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని టీడీపీ లీగల్ టీం చాలా స్పష్టంగా కోర్టుకి చెప్పింది. Kesineni Nani - Chandrababu Case
- Naveen
- Published On : September 10, 2023 / 06:35 PM IST
Kesineni Nani - Chandrababu Case (Photo : Google)
Kesineni Nani – Chandrababu Case : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కేసుకి సంబంధించి విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసుకి ఎలాంటి సంబంధం లేదన్నారాయన. ఈ కేసులో పస లేదని ఆయన తేల్చి చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ ఓ పాలసీ డెసిషన్ అని వెల్లడించారు. ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అని ఆరోపించారు. చంద్రబాబు క్లీన్ ఇమేజ్ తో ఈ కేసు నుంచి బయటకు వస్తారని కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు.
”చంద్రబాబు కేసులో పస లేదు. యువతకు ఉద్యోగాలు రావాలని స్కిల్ డెవలప్ మెంట్ స్కీం తెచ్చారు. అది మంత్రిమండలి నిర్ణయం. చంద్రబాబుకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని టీడీపీ లీగల్ టీం చాలా స్పష్టంగా కోర్టుకి చెప్పింది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. చంద్రబాబుది అక్రమ అరెస్ట్. ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ కేసు. న్యాయం గెలుస్తుంది. చంద్రబాబు క్లీన్ ఇమేజ్ తో బయటకు వస్తారు” అని కేశినేని నాని నమ్మకంగా చెప్పారు.
టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విజయవాడ ఏసీబీ కోర్టు హాలులో తమ పార్టీ అధినేత చంద్రబాబుని కలిశారు. కేసు విషయంపై వారు చంద్రబాబుతో చర్చించారు. చంద్రబాబు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నట్లు వారు తెలిపారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై విజయవాడ ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇస్తారని అందరిలోనూ నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఏపీ సీఐడీ తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా పోటాపోటీగా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసిందని సిద్ధార్ధ లూథ్రా వాదించారు. ఈ స్కామ్ పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అన్నారు. 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయని, తీర్పు కూడా రిజర్వ్ అయిందని గుర్తు చేశారు. ఈ కేసు ఎప్పుడో మగిసిందని, నిందితులందరికీ బెయిల్ కూడా వచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికలు వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు రీఓపెన్ చేశారు అని కోర్టులో వాదనలు వినిపించారు సిద్ధార్ధ లూద్రా.
