CM Chandrababu Naidu
అధికారంలో ఉన్నాం..పదవులు వచ్చాయ్..ఎంజాయ్ చేస్తామంటే కుదరదు. ప్రభుత్వంలో ఉన్నది పవర్ను అనుభవించడానికి కాదు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తామంటే ఊరుకునేది లేదు. ప్రతీ విషయంలో జవాబుదారీగా ఉండాల్సిందే. అది నేను అయినా మీరైనా అంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పుడైతే ఏకంగా తీరు మార్చుకోండి అంటూ మంత్రులు, ఎంపీలకు చురకలు అంటించారు.
మంత్రులు పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న సీఎం..ప్రోగ్రెస్ట్ రిపోర్ట్ను వారి ముందు పెట్టి ప్రశ్నించారట. యువ మంత్రుల పనితీరుపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు టాక్. పాతవారిని పక్కన పెట్టి యువతరం అని కొత్తవారికి మంత్రి పదవులు ఇస్తే వారిలో ఆ వేగం కనిపించడం లేదని సీరియస్ అయ్యారట చంద్రబాబు. తన దగ్గరున్న నివేదికల ఆధారంగా అమాత్యుల పనితీరుపై క్లాస్ తీసుకున్నారట. ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉంటే ఆరుగురు సీనియర్లు కాగా, 18 మందికి కొత్తవారికి అవకాశం ఇచ్చానని చెప్పారు బాబు. వారిలో వేగం ఉంటుందని భావిస్తే..దూకుడుగా పనిచేయడం లేదని..ప్రజల్లోకి వెళ్లడానికి వచ్చిన ఇబ్బందులేంటో చెప్పాలని ప్రశ్నించారట.
ఫొటోలకు ఫోజులు కాదు.. పని ఫలితాలు చూపాలి..
యువ మంత్రులు తమ పనితీరు మెరుగుపర్చుకోకపోతే నష్టపోతారని వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు. మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించాలని..అధికారులతో పని చేయించుకోవాలని దిశానిర్ధేశం చేశారట. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఫోకస్ చేయాలని మంత్రులకు సూచించారట. ఫొటోలకు ఫోజులు ఇవ్వకుండా పని చేసి ఫలితాలు చూయించాలని చురకలు అంటించారట. ప్రస్తుతం ఉన్న 53 శాతం అనుకూల ఓటింగ్ను 60 శాతానికి తీసుకెళ్లాలని అమాత్యులకు హితబోధ చేశారట చంద్రబాబు.
ఇక సోషల్ మీడియా వాడటంలోనూ మంత్రులు వెనకబడిపోయారని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఐటీ నిపుణుడివైనా సోషల్ మీడియా వినియోగంలో ఎందుకు వెనక పడ్డావని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను ప్రశ్నించారట సీఎం. ఆయన ర్యాంక్ కూడా సంతృప్తికరంగా లేదన్నారట. సోషల్ మీడియా యూసేజ్లో మంత్రి ఫరూఖ్ చివరి స్థానంలో ఉన్నట్లు చెప్పారట.
ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం పెంచేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు సోషల్ మీడియాను విరివిగా వాడాలని దిశానిర్దేశం చేశారట సీఎం. జిల్లాల్లో ఇంచార్జ్ మంత్రులు యాక్టీవ్ కావాలని సూచించారు. కొత్త ఎమ్మెల్యేలు చాలా మిస్టేక్స్ చేస్తున్నారని.. వారిని నియంత్రించాల్సిన బాధ్యత ఇంచార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఇంచార్జ్ మంత్రి, జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీ, కలెక్టర్ ఒక టీమ్గా పనిచేసి ఫలితాలు సాధించాలని సూచించారు.
పార్టీ సమావేశానికి కొందరు ఎంపీల గైర్హాజరుపై కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ మీటింగ్ల కంటే ఇతర కార్యక్రమాలు ఎక్కువా అంటూ ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయులు, అంబికా లక్ష్మీనారాయణ ప్రస్తావిస్తూ ప్రశ్నించారట. కేంద్రం నుంచి నిధుల సాధించడంలో ఎంపీలు, రాష్ట్ర మంత్రుల మధ్య సమన్వయం మరింత పెరగాలని సూచించారట చంద్రబాబు. అయితే ఈసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అలర్ట్గా ఉంటూ వస్తున్నారు సీఎం. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దని జాగ్రత్త పడుతున్నారు.
ఆ ఘటనపై తీవ్ర అసంతృప్తి
ప్రభుత్వం వచ్చిన మొదటల్లోనే మంత్రి రాంప్రసాద్రెడ్డి సతీమణి..ఓ ఎస్ఐ విషయంలో వ్యవహరించి తీరు కాంట్రవర్సీ అయింది. వెంటనే సదరు ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు..మంత్రికి ఫోన్ చేసి మందలించారు. తర్వాత సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఇష్యూలోనూ వెంటనే రియాక్ట్ అయి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ పనితీరు మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేసి..ఫోన్లో మందలించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కాంట్రవర్సీ వ్యవహారాలపై కూడా వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. లేటెస్ట్గా జేసీ ప్రభాకర్రెడ్డి తీరుపై కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న చంద్రబాబు.. పొత్తులపై ఇప్పటికే ఓ క్లారిటీతో ఉన్నారు. సేమ్టైమ్ ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ప్రతీ విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేది మంత్రులు, ఎమ్మెల్యేలే కాబట్టి వారి పనితీరు, బిహేవియర్ బాగుండేలా సలహాలు, సూచనలు ఇస్తూ దిశానిర్ధేశం చేస్తూ వస్తున్నారు. ఒకటి రెండు సార్లు చెప్పినా పద్దతి మార్చుకోకపోతే ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాల్సి వస్తుందని ఓపెన్గానే చెప్పేస్తున్నారట చంద్రబాబు. టీడీపీ అధినేత ప్రజాప్రతినిధుల్లో ఎంతవరకు మార్పు తీసుకొస్తారో చూడాలి మరి.