Chandrababu Naidu
Chandrababu Naidu: దేశంలో పెద్ద నోట్లు రద్దు చేయాలని తాను గతంలోనే చెప్పానని ఏపీ (AP) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా (Anakapalle)లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అనకాపల్లి సుంకర మెట్ట కూడలి నుంచి జంక్షన్ మీదుగా నెహ్రూ చౌక్ వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ కి ఇరు వైపులా చంద్రబాబుకి హారతులు పట్టారు మహిళలు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “నేను డిజిటల్ కరెన్సీ ప్రోత్సహించాను. పెద్ద నోట్లు రద్దు చేయాలని అప్పుడే చెప్పాను. దేశంలో అవినీతి పరులు చాలా మంది ఉన్నారు. పెద్ద నోట్ల వల్ల అవినీతి, అక్రమ లావాదేవీలు పెరిగాయి. ఆర్బీఐ రూ.2,000 నోట్లు వెనక్కు తీసుకుంటున్నట్లు సమాచారం వచ్చింది.. అనకాపల్లి రాగానే నాకు ఈ విషయం తెలిసింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం హర్షనీయం” అని చెప్పారు.
కాగా, 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు చేసిన సమయంలోనూ చంద్రబాబు నాయుడు ఇదే విధంగా స్పందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొదటి నుంచీ తాను పెద్ద నోట్ల రద్దుకు మద్దతు తెలుపుతున్నానని చెప్పారు.