Somu Veerraju: : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలవడాన్ని స్వాగతిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ ధియేదర్తో కలిసి సోము మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు సంబంధిత కేంద్ర పథకాలను జగన్ ప్రభుత్వం సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అమరావతి రైతుల యాత్రపై వైసీపీ ఎంపీ దాడి చేయించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు ఎవరూ ప్రోత్సహించ కూడదన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వాస్తవం తెలుసుకుని మాట్లాడాలని సోము సూచించారు.
Somu Veerraju : ఎన్టీఆర్ పేరు తొలగింపు వివాదం.. జగన్ ప్రభుత్వానికి బీజేపీ చీఫ్ వార్నింగ్
విశాఖలో పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవటంపట్ల వైసీపీ ప్రభుత్వం తీరును సోము వీర్రాజు తప్పుబట్టారు. ఇటువంటి ఘటనలు సరి కాదని పవన్ను సంఘీభావంగా అందరూ కలిశారన్నారు. చంద్రబాబు, పవన్ కలవడాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. పవన్ రోడ్డు మ్యాప్ విషయంపై పాత్రికేయులు ప్రశ్నించగా.. రోడ్ మ్యాప్ పవన్ అడుగుతున్నారని, దానిని పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని, పవన్కు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి దూరంపోలేదని, బీజేపీ, జనసేన పార్టీలు కలిసే ముందుకు వెళ్తున్నాయని అన్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో సీనియర్ నేత అని, ఆయన వ్యాఖ్యలపై తాను స్పందించనని పేర్కొన్నారు. ఆయనేదో అన్నారని తాను అన్నింటికీ స్పందించబోనన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎంత వరకు మాట్లాడాలో అంతే మాట్లాడతానంటూ సోము వీర్రాజు చెప్పారు.