YS Jagan Mohan Reddy : సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించారు. ఒంగోలు నగరంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అనే పద్దతి లేదని అన్నారు. గత ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తేడా గమనించాలని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక పేదలకు అన్ని విధాలా అండగా నిలించామని చెప్పారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధన అందిస్తున్నామని, పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా రూ. 25లక్షలకు ఆరోగ్యశ్రీ నిధులను పెంచామని, పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని జగన్ అన్నారు.
Also Read : పేదలకు ఓ న్యాయం, పెద్దవారికి ఓ న్యాయం అనే విధానాన్ని మార్చేశాం : సీఎం జగన్
భువనేశ్వరి వ్యాఖ్యలపై జగన్ సెటైర్లు ..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పంలో చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. రెండు రోజుల క్రితం నిజాన్ని గెలిపిద్దాం అనే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి ఈసారి కుప్పం నుంచి నేను పోటీ చేస్తా.. మీరు మద్దతిస్తారా అంటూ స్థానికులను ప్రశ్నించారు. దీంతో స్థానిక ప్రజలు భువనేశ్వరి పోటీ చేస్తే సంతోషమేనని, కానీ, చంద్రబాబు నాయకత్వం కావాలని అన్నారు. ఇద్దరిలో ఒకరిపేరు చెప్పాలని భువనేశ్వరి కోరడంతో ఇద్దరూ కావాలంటూ ప్రజలు జవాబు ఇచ్చారు. తనకు పోటీచేసే ఆలోచన లేదని, కేవలం సరదాకోసమే ఇలా మాట్లాడానని భువనేశ్వరి అన్నారు. తాజాగా భువనేశ్వరి వ్యాఖ్యలపై జగన్ కామెంట్లు చేశారు.
Also Read : ఇంకా ఏమి కావాలి? షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా
”ఎన్నికలు వస్తుండటంతో మేము సిద్ధం అంటుంటే.. మరోవంక చంద్రబాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. నేరుగా కుప్పం వెళ్లి బై బై బాబు అంటోంది. ఏకంగా కుప్పంలోనే ఆమె అర్ధాంగినోటే పంచ్ డైలాగ్ లు వస్తున్నాయి. చంద్రబాబును చివరికి కుప్పం ప్రజలు కూడా సమర్ధించని పరిస్థితి ఉంద”ని జగన్ అన్నారు. చంద్రబాబును సమర్ధించేవారు ఎవరంటే..? ఏపీకి సంబంధం లేనివారు.. వాళ్లంతా రాష్ట్రంలోకి వచ్చి దోచుకునేందుకు అవాటు పడినవారు మాత్రమే చంద్రబాబును సమర్థిస్తున్నారంటూ జగన్ అన్నారు. ”నాకు చంద్రబాబు నాయుడు మాదిరి నాన్ రెసిడెన్స్ ఆంధ్రావాళ్ల మద్దతు లేదు.. దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు. నేను నమ్ముకుంది.. పైన దేవుడిని.. కింద ప్రజలను” అని జగన్ అన్నారు.