BV Raghavulu: ఏపీలో వాలంటీర్ వ్యవస్థను నిందించడం కరెక్ట్ కాదు.. యూసీసీపై మూడు పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాలి
రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ విమర్శల నేపథ్యంలో సీపీఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థను నిందించడం కరెక్ట్ కాదని ఆయన చెప్పారు.
- Harishth Thanniru
- Published On : July 13, 2023 / 11:36 AM IST
CPM Politburo Member BV Raghavulu
CPM Politburo Member BV Raghavulu: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఏలూరు వారాహి విజయ యాత్రలో వాలంటీర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వాలంటీర్లు సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి సేకరించి ప్రభుత్వానికి ఇస్తున్న డేటా దుర్వినియోగం అవుతోందని, దీనివల్లే రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతున్నారని పవన్ ఆరోపించారు. పవన్ వ్యాఖ్యాలను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. తాజాగా వాలంటీర్లపై అసత్య ఆరోపణలు చేశారంటూ పవన్ కళ్యాణ్ పై పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసును సైతం నమోదు చేశారు.
వాలంటీర్ వ్యవస్థను నిందించడం కరెక్ట్ కాదు..
రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ విమర్శల నేపథ్యంలో సీపీఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థను నిందించడం కరెక్ట్ కాదని ఆయన చెప్పారు. నిర్దిష్టమైన ఆరోపణలు ఉంటే విచారణ చేయాలి. ఆధారాలు లేకుండా మాట్లకూడదు అంటూ తన అభిప్రాయాన్ని బివి రాఘవులు తెలిపారు. అయితే, వాలంటీర్ వ్యవస్థను అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వం తీసుకుని రాలేదని, పంచాయతీలను నిర్వీర్యం చేయడానికి ఈ వ్యవస్థను తీసుకొచ్చారని, వాలంటీర్ల వ్యవస్థ వైసీపీ ఆధీనంలో ఉందని రాఘవులు విమర్శించారు.
Pawan Kalyan: వాలంటీర్లపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. పవన్ కల్యాణ్పై కేసు నమోదు చేసిన పోలీసులు
రాజధానిలో భూ పంపిణీ కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని రాఘవులు చెప్పారు. యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) పై మూడు పార్టీలు తమ అభిప్రాయం చెప్పాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మత రాజకీయాలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని రాఘువులు విమర్శించారు. బీజేపీ బలపడడానికి సహకరించే పార్టీలకు మేము సహకరించమని తేల్చిచెప్పారు. రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేస్తే.. ఏపీలో పార్టీలు బీజేపీతో స్నేహం చేస్తున్నాయని విమర్శించారు. దొంగ ఓట్లపై పోరాటం చేసిన చరిత్ర సీపీఎం పార్టీది అని, దొంగ ఓట్లను చేర్చడంలో మిగతా పార్టీలు ఉన్నాయన్నారు. బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీతో అయినా కలిసి వెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నామని రాఘవులు స్పష్టం చేశారు.
