Mandous Cyclone Alert: తీవ్ర తుపానుగా మారి ఏపీవైపు దూసుకొస్తున్న మాండూస్.. నేడు, రేపు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. తుపాను దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాలవైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ వాఖ తెలిపింది.
- Harishth Thanniru
- Published On : December 9, 2022 / 07:25 AM IST
Heavy Rains
Mandous Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. తుపాను దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాలవైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ వాఖ తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం వద్ద శుక్రవారం అర్థరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురువనున్నాయి.
Cyclone Mandous: ఏపీకి పొంచిఉన్న ముప్పు.. తుఫానుగా మారిన తీవ్రవాయుగుండం.. ఆ జిల్లాల్లో రెడ్అలర్ట్..
తుపాను తీరాన్ని తాకే సమయంలో, తరువాత ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను తీరందాటే సమయంలో గంటకు 65- 85 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు అధికారులకు సూచించారు.
తుపాను తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఈనెల 10 వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ సూచించారు. రాష్ట్రంలో తుపాను ప్రభావం చూపే ఆరు జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఏపీ అలర్ట్ ద్వారా ఇప్పటికే ఆరు జిల్లాలో హెచ్చరిక సందేశాలు పంపామన్నారు.
