కృష్ణమ్మ స్పర్శతో కుప్పం పరవశించిపోయింది. దశాబ్దాల సమస్యకు శుభంకార్డు పడింది. తరతరాలుగా కుప్పం, పలమనేరు నియోజకవర్గాలను వేధిస్తున్న తాగు, సాగునీటి సమస్య ఎట్టకేలకు తీరింది. 214 కోట్ల రూపాయలతో నిర్మించిన కుప్పం బ్రాంచి కెనాల్ను జాతికి అంకితం చేశారు సీఎం జగన్… శ్రీశైలం నుంచి కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు హంద్రి, నీవా జలాలను తరలించే బృహత్తర కార్యక్రమం పూర్తిచేయడం ద్వారా రెండు నియోజకవర్గాల ప్రజల దాహర్తి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
కొండలు, గుట్టలు దాటుకుని 672 కి.మీ. దూరం నుంచి కృష్ణా జలాలు కుప్పంలోకి ప్రవేశించాయి. హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మను కుప్పం తీసుకువచ్చి ప్రజల తాగు,సాగునీటి సమస్యకు ముగింపు పలికింది ప్రభుత్వం. కుప్పం బ్రాంచ్ కెనాల్ను జాతికి అంకితం చేయడం ద్వారా సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
ఏడాదిన్నర క్రితం 2022 సెప్టెంబర్లో కుప్పంలో పర్యటించిన సీఎం జగన్… నియోజకవర్గ ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం చెప్పినట్లే.. ఏడాదిన్నర రికార్డు సమయంలో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి కుప్పం, పలమనేరు నియోజకవర్గ వాసులకు శాశ్వతంగా మేలు జరిగేలా… సుమారు నాలుగు లక్షల మంది దాహర్తి తీర్చే రిజర్వాయర్లను జాతికి అంకితం చేశారు.
సువర్ణాక్షరాలతో లిఖించిదగ్గ రోజు
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 672 కి.మీ దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడం సువర్ణాక్షరాలతో లిఖించిదగ్గ రోజని అభివర్ణించారు సీఎం జగన్.. కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు… 14 ఏళ్లు సీఎంగా పనిచేసినా నీళ్లు తేలేకపోయారని… తాను మాట ఇచ్చిన ఏడాదిన్నరలోనే పూర్తి చేశానని చెప్పారు సీఎం… కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా, మరో రెండు ప్రాజెక్టులను నిర్మించి స్టోరేజ్ పెంచడంతో కుప్పంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్.
ఎన్నికల్లోగా కుప్పం నియోజకవర్గంలో కృష్ణా నీరు పారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసింది. అనుకున్నట్లే ఎన్నికల షెడ్యూల్కు ముందే కృష్ణమ్మను కుప్పం తీసుకువచ్చింది సీఎం జగన్ ప్రభుత్వం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కుప్పం బ్రాంచ్ కెనాల్లో 68 కిలోమీటర్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ ద్వారా ఐదు చెరువుల్లోకి కృష్ణా నీటిని నింపారు.
నియోజకవర్గంలో మొత్తం 106 చెరువులకు కృష్ణాజలాలు అందనున్నాయి. ఈ కెనాల్ ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అంతేకాకుండా 4 లక్షల మందికి తాగునీటి సమస్య తీరనుంది. జలయజ్ఞంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీ నీవా సుజల స్రవంతి పథకానికి రూపకల్పన చేశారు.
ఆ తర్వాత కుప్పం బ్రాంచ్ కెనాల్ను చేపట్టి సాగు, తాగునీటిని అందిస్తానని 2015లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ పనుల్లో విపరీతమైన జాప్యం వల్ల చంద్రబాబు హయాంలో నీళ్లు అందుబాటులోకి తేలేకపోయారు. ఇక సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక… కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పరుగులు పెట్టించారు.