CM Jagan : మహిళల రక్షణ కోసం 18 దిశ పోలీస్ స్టేషన్లు : సీఎం జగన్
మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం తమదని సీఎం జగన్ అన్నారు. మంత్రులుగా మహిళలకు అవకాశం కల్పించామని తెలిపారు.
- bheemraj
- Published On : November 18, 2021 / 05:13 PM IST
Disha Police Station
DISHA Police Stations : మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం తమదని సీఎం జగన్ అన్నారు. మంత్రులుగా మహిళలకు అవకాశం కల్పించామని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఎస్ఈసీ గా మహిళను నియమించామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ అభివృద్ధి పథకాలు వివరించారు. కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టుల్లో మహిళలకు 51 శాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. 26 జెడ్పీ డిప్యూటీ చైర్మన్లలో 15 మహిళలకే కేటాయించినట్లు వెల్లడించారు.
మహిళల రక్షణ కోసం 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దిశయాప్ లో ఎస్ఓఎస్ బటన్ నొక్కిన 10 నిమిషాల్లోనే పోలీసులు వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గతంలో వెలసిన 44 వేల బెల్టు షాపులు పూర్తిగా తీసేశామని పేర్కొన్నారు. మహిళలకు ఇబ్బంది కలగకూడదని మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూములను తీసేశామని తెలిపారు. మహిళలకు ఇబ్బంది ఉండొద్దనే రాత్రి 8 గంటలకే మద్యం షాపులు మూసేయాలని ఆదేశించామని పేర్కొన్నారు.
AP New Scheme : ఏపీలో మరో కొత్త పథకం
చంద్రబాబు పాలనలో నెలకు ఐఎంఎఫ్ లిక్కర్ 34 లక్షల కేసులు అమ్ముడైతే…ఇప్పుడు 21 లక్షల కేసులే అమ్ముడవుతోందన్నారు. గతంలో బీర్లు 17 లక్షల కేసులు అమ్ముడైతే..ఇప్పుడు 7 లక్షల కేసులకే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నియంత్రించగలిగామని తెలిపారు. ఆరు నెలల్లో మహిళలపై లైంగిక దాడుల సంఖ్య చాలా తగ్గిపోయిందన్నారు.
మహిళలపై లైంగిక దాడుల కేసుల్లో 42 రోజుల్లోనే దర్యాప్తు పూర్తయ్యేలా చేశామని పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న 2 లక్షల 17 వేల 647 మందికి జియో ట్యాగింగ్ చేశామని వెల్లడించారు. ప్రతి పోలీస్ స్టేషన్ రిసెప్షన్ లో మహిళా అధికారిని ఏర్పాటు చేశామని తెలిపారు. క్రైమ్ సీన్ మేనేజ్ మెంట్ కోసం 18 వాహనాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
