Prakasam District :ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. దర్శి మండలం మండ్లమూరులో భూమి కంపించింది. సింగన్నపల్లి, మారెళ్లలోనూ ఉదయం 10.40 గంటలకు సెకన్ పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. శనివారం కూడా మండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో వరుసగా భూప్రకంపనలు చోటు చేసుకోవటంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
డిసెంబర్ నెలలో ఏపీలో పలు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. డిసెంబర్ 4వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొన్ని సెకన్లు భూమి కంపించింది. శనివారం దర్శి నియోజకవర్గంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, కురిచేడు మండలాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ భూ ప్రకంపనలకు భయపడాల్సిన అవసరం లేదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.