TDP Leader Narayana : టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో కొండాపూర్లోని ఆయన నివాసంలో మంగళవారం (మే 10) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆయనను సీఐడీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజ్ కేసుతో పాటు, అమరావతి రాజధాని భూముల CRDA కేసులో కూడా నారాయణ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లో విచారణ కోసం నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధం ఉందన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ నారాయణను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
నారాయణ స్కూల్ నుంచే పేపర్ లీకేజ్ అయినట్టు ఈ నెల 5న సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే పేపర్ లీక్ కేసులో తిరుపతి నారాయణ ఎస్వీ బ్రాంచ్కు చెందిన గిరిధర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. గిరిధర్ రెడ్డి వాట్సాప్ నంబర్ నుంచి తెలుగు క్వశ్చన్ పేపర్ సర్క్యూలేట్ అయింది.
అయితే పేపర్ లీక్పై కేసు నమోదు చేసిన చిత్తూరు జిల్లా సీఈడీ అధికారులు.. హైదరాబాద్ కొండాపూర్ నుంచి నారాయణను అరెస్ట్ చేసి చిత్తూరు సీఐడీ కార్యాలయానికి తరలిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, కర్నూలు మీదుగా నారాయణను సీఐడీ అధికారులు తరలిస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి టెన్త్ పేపర్లు లీకైన కేసులో వైస్ ప్రిన్సిపల్ గిరిధర్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదు :
పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్ కేసులో నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదు అయింది. చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు కృష్ణాజిల్లా మండవల్లిలో సీఐడీ కేసులు నమోదు చేసింది. చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబరు 111/2022 కింద కేసు నమోదు చేశారు. కృష్ణాజిల్లా మండవల్లిలో ఈ నెల 2వ తేదీన ఎఫ్ఐఆర్ నెంబరు 141/2022 కింద కేసు నమోదు చేశారు.
ఇప్పటికే చిత్తూరు కేసులో నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారాయణతో పాటు ఆయన సతీమణికి కూడా నారాయణ విద్యాసంస్థల్లో కీలక పాత్ర ఉంది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో తెల్లవారు జామున హైదరాబాద్లో నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాల్ ప్రాక్టీస్ నిరోదక చట్టం 408 ఐపిసి కింద కేసులు నమోదు చేశారు.
Read Also : YS Jagan on TDP: టీడీపీపై జగన్ సీరియస్.. కావాలని రెచ్చగొడుతున్నారన్న ఏపీ సీఎం!