Vallabaneni Vamshi: మా ఎక్స్ బాస్ కొనుగోలు విషయంలో ఎక్స్పర్ట్.. ప్రజాక్షేత్రంలో వైసీపీదే విజయం
ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పసుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించిన విషయం విధితమే. ఎవరెవరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారనే అంశంపై ఏపీలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడారు. మా ఎక్స్ బాస్ చంద్రబాబు కొనుగోలు విషయంలో ఎక్స్పర్ట్ అంటూ విమర్శలు గుప్పించారు.
- Harish Thanniru
- Published on- March 24, 2023 / 12:45 PM IST
Vallabaneni Vamshi
Vallabaneni Vamshi: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ (YCP) కి షాక్ తగిలింది. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఆరు వైసీపీ కైవసం చేసుకోగా, ఒక స్థానం టీడీపీ (TDP) విజయం సాధించింది. అయితే, ఊహించని రీతిలో టీడీపీ అభ్యర్థి పసుమర్తి అనురాధ (Pasumarthi Anuradha) విజయం సాధించటం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి మద్దతుగా కేవలం 19మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆమెకు 23 ఓట్లు రాగా, మిగిలిన నాలుగు ఓట్లు వైసీపీ ఎమ్మెల్యేలవి పోలయ్యాయి. ఇద్దరు మాత్రం బహిరంగానే వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. వారిలో కోటరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి. వీరు కాకుండా మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. వైసీపీ అధిష్టానం (YCP leadership) మాత్రం వారిద్దరెవరో తెలిసిందని, త్వరలో చర్యలుంటాయని చెబుతోంది.
Minister Roja: జగన్ను మోసం చేసిన వాళ్లు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు ..
తాజా పరిణామాల నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఆసక్తికర కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడికి ఇటువంటి ఆటలు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. మా ఎక్స్ బాస్ కొనుగోలు విషయంలో ఎక్స్పర్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. కరణం బలరాంకు 40 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు అంటే ఎమిటో తెలుసని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క స్థానం గెలిచి రాష్ట్రం మొత్తం టీడీపీ గెలిచిందన్నట్లుగా ప్రచారం చేసుకోవటం ఆ పార్టీకి కొత్తేమీకాదని, ప్రజాక్షేత్రంలో ఆ పార్టీని, చంద్రబాబు నాయకత్వాన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని వంశీ అన్నాడు.
ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే ఓటేస్తారు. ప్రతి ఒక్కరికీ ఓటు ప్రక్రియలో ఒక్కొక్క కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ను బట్టి ఎవ్వరు ఓటు వేశారో తెలిసిపోతుంది. ఇప్పటికే టీడీపీకి క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురిని అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ నలుగురిపై త్వరలోనే అధిష్టానం తగు చర్యలు తీసుకుంటుందని వంశీ అన్నారు.
