Harirama Jogaiah
Janasena Party : జనసేన – టీడీపీ పొత్తు విషయంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల కేటాయింపు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మంలో జనసేనను విస్మరిస్తూ చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులను మండపేట, అరకు నియోజకవర్గాలకు ప్రకటించడం తప్పని అన్నారు. ఇలాంటి చర్య పొత్తుధర్మాన్ని విస్మరించడమే అవుతుందని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రకటనకు విరుగుడుగా పవన్ కల్యాణ్ జనసేనకు పట్టుకొమ్మలైన రాజోలు, రాజానగరం సీట్లను ప్రకటించినప్పటికీ జనసైనికులు సంతృప్తి చెందడం లేదని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు, తణుకు, నిడదవోలు నియోజకవర్గాలను జనసేనకు ప్రకటించినట్లయితే పవన్ కల్యాణ్ కు ఎంత నిబద్దత ఉందో తేటతెల్లమయ్యేదని అన్నారు.
Also Read : నిన్న పవన్ కల్యాణ్.. నేడు నాగబాబు.. టీడీపీ, జనసేన మధ్య అసలేం జరుగుతోంది?
పొత్తులో భాగంగా.. 25 నుండి 30 స్థానాలు మాత్రమే జనసేనకు కేటాయిస్తే 25 సంవత్సరాల యువత భవిష్యత్తుకు పెద్దపీట వేస్తామన్న పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు అర్థం లేకుండా పోతుందని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. తక్కువ స్థానాలకు పవన్ కల్యాణ్ ఒప్పుకుంటే సదరు పొత్తు విఫల ప్రయోగంగా మారే ప్రమాదం లేకపోలేదని అన్నారు. 2024 ఎన్నికలకు జనసేనతో పొత్తు టీడీపీ మనుగడకు అత్యవసరమని, టీడీపీ నాయకులు, క్యాడర్ గుర్తుంచుకోవాలని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.