Heavy Rain Alert : ఏపీ వైపు దూసుకొస్తున్న వర్ష ముప్పు.. ఈ జిల్లాలకు అలర్ట్.. బయటకు వెళ్లేవారు జాగ్రత్త!
Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
- Sreehari A
- Published on- September 20, 2026 / 08:30 PM IST
Heavy Rain Alert
- బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
- రేపు, ఎల్లుండి రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు
- దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలకు సమీపించే అవకాశం
- గంటకు 50–60 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు
Heavy Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ సెప్టెంబర్ 21న వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అనంతరం సెప్టెంబర్ 22 నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 23 ఉదయం నాటికి ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలకు సమీపించే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.
అల్పపీడనం మరింత బలపడొచ్చు :
ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న రోజుల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Read Also : SIR Notices : జైశంకర్ నుంచి కేజ్రీవాల్ వరకు.. VVIPలకు SIR నోటీసులు.. అసలు కారణం ఇదే!
ఈ ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, నంద్యాల, కడప జిల్లాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి.
గంటకు 50కిమీ వేగం :
మంగళ, బుధవారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలతో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ముఖ్యంగా కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఆందోళనకరంగా మారే అవకాశం కనిపిస్తోంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారొచ్చని అధికారులు హెచ్చరించారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు పలు సూచనలు చేశారు.
