Heavy Rains Forecast : అండమాన్ సముద్రం మరియు పొరుగు ప్రాంతాల మధ్య అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది డిసెంబర్ 2వ తేదీ నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతిలో వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది డిసెంబర్ 3వ తేదీ నాటికి తుఫానుగా బలపడి వాయువ్య దిశగా కదిలి, మరింత బలపడి డిసెంబర్ 4వ తేదీ ఉదయానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో, డిసెంబర్ 3వ తేదీన, ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు .గోదావరి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 4వ తేదీ ఏపీ లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, కొన్ని చోట్ల భారీ నుండి అతి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read : CM YS Jagan Mohan Reddy : రేపు,ఎల్లుండి వరద ప్రభావిత జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ప్రత్యేకించి శ్రీకాకుళం విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 3,4 తేదీల్లో తీరం వెంబడి 80 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కావున ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని అధికారులు సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. డిసెంబర్ 3-5 తేదీల మధ్య మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. సముద్రంలో ఉన్న వారు డిసెంబర్ 2 వ తేదీ నాటికి తిరిగి తీరానికి తిరిగి వచ్చేలా సమాచారం ఇవ్వాలన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను రైతులు కాపాడుకోవాలని మరియు వాటిని సురక్షితంగా ఉంచాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు.