వైఎస్ జగన్‌ను జైల్లో వేయాలి..!- హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

వైఎస్ వివేకా హత్య కేసులో చేతులన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయో అందరికీ తెలిసిందే. వివేకా కూతురు చెయ్యి కూడా ఎటువైపు చూపిస్తుందో మనకు తెలుసు.

Home Minister Vangalapudi Anitha : రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ ను సందర్శించినప్పుడు తాను ఎమోషన్ అయ్యానని చెప్పారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. అక్కడికి వెళ్లినప్పుడు తాను కన్నీటిపర్యంతం అయ్యానని తెలిపారు. చేయని తప్పునకు తమ నాయకుడిని అన్యాయంగా 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లోనే స్నేహా బ్లాక్ లో ఉంచారని గుర్తు చేశారు. రోజులన్నీ ఒకేలా ఉండవన్న మంత్రి అనిత.. తప్పు చేయని వారు ఎవరైనా జైలుకి వెళ్లకూడదని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

”స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్లేసరికి కొంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. లోపలికి వెళ్లి చూశాం. అక్కడున్న సౌకర్యాలన్నీ చూశాం. కాకపోతే 53 రోజులు మా నాయకుడు, ఏ నేరమూ చేయకుండా స్నేహ బ్లాక్ లో ఉండటం అనేది చాలా బాధాకరం. రోజులన్నీ ఒకేలా ఉండవు అని అంటారు. ఈరోజు అదే బ్లాక్ కు మేము విజిటర్స్ కింద వెళ్లాం. అదీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. రాజకీయాలను పక్కన పెడితే.. తప్పు చేయని వారు ఎవరైనా జైల్లోకి వెళ్లే పరిస్థితి రాకూడదు” అని మంత్రి అనిత అన్నారు.

”మర్డర్ కు ప్రేరేపించిన వాడిని కూడా తీసుకెళ్లి జైల్లో వేయాలని అన్నారు. అదే పరిస్థితి కనుక వస్తే ఫస్ట్ జగన్ ను జైల్లో వేయాలి. వైఎస్ వివేకా హత్య కేసులో చేతులన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయో అందరికీ తెలిసిందే. వివేకా కూతురు చెయ్యి కూడా ఎటువైపు చూపిస్తుందో మనకు తెలుసు. వాళ్ల కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడటం మానేసి శాంతి భద్రతల గురించి మాట్లాడటం విడ్డూరం” అని వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు మంత్రి అనిత.

”నంద్యాల వెళ్లి జగన్ మాట్లాడిన మాటలను ప్రజలు గమనించారు. నేనుంటే అమ్మఒడి ఇచ్చే వాడిని, నేనుంటే రైతుభరోసా ఇచ్చే వాడిని, నేనుంటే అది ఇచ్చే వాడిని, నేనుంటే ఇది ఇచ్చే వాడిని.. ఇలా ఒకే పాట పాడుతున్నారు. సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడటం చేతకాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితిలో ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఉన్నారు. అది ఆయన నైజం” అంటూ జగన్ పై ధ్వజమెత్తారు మంత్రి అనిత.

Also : రోజుకో మలుపు తిరుగుతున్న దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం.. తాజాగా మరో ట్విస్ట్

ట్రెండింగ్ వార్తలు