Jawad Cyclone : ఉత్తరాంధ్రపై జొవాద్ తుపాను ప్రభావం.. అతి భారీ వర్షాలు..తీర ప్రాంతాల్లో హైఅలర్ట్
ఉత్తరాంధ్రపై జొవాద్ తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- bheemraj
- Published On : December 3, 2021 / 06:49 PM IST
Cyclone Effect
Impact of Jawad cyclone on Uttarandhra : ఉత్తరాంధ్రపై జొవాద్ తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జొవాద్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 100 కిలో మీటర్లకు పైగా వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. తుపాను నేపథ్యంలో ఎలాంటి పరిస్ధితినైనా ఎదుర్కోవడానికి ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు పూర్తిగా సన్నద్ధమై ఉన్నారు. ఎన్ డీఆర్ఎఫ్, ఎస్ డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి సన్నదతో రంగంలోకి దిగి ఉన్నాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారిన సంగతి తెలిసిందే. రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి తుపాను పయనించనుంది. తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. అనంతరం పూరీ మీదుగా వెస్ట్బెంగాల్ వైపు జొవాద్ పయనించనుంది.
Cyclone Jawad : తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
ప్రస్తుతం విశాఖకు 420 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 530 కిలోమీటర్లు.. పారాదీప్కు 630 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం అయింది. తీరం దాటకుండానే వెస్ట్బెంగాల్ వైపు తుపాను పయనించనుంది. తుపాను ప్రభావంతో కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు తీరం వెంబడి గరిష్టంగా 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
దీంతో సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. తుపాను హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల కలెక్టర్లు సహాయకచర్యలపై ఫోకస్ పెట్టారు.
జొవాద్ తుపాను ముప్పుపై విజయనగరం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం చూపే ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అలర్ట్ చేసింది. చేపట్టాల్సిన సహాయ, పునరావాస చర్యలపై ప్రత్యేకాధికారి కాంతిలాల్ దండే.. అధికారులతో సమీక్షించారు. తుపాను తీవ్రమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించారు. భోగాపురం, పూసపాటిరేగతో పాటు పార్వతీపురం డివిజన్ నాగావళి నది పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ఏరియాలైన జియమ్మవలస, కురుపాం, కొమరాడ తదితర మండలాల పై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని సిద్ధం చేసింది.
