హైదరాబాద్ లో సినీరంగానికి చెందిన వారి ఇళ్ళపై ఐటీ శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా హీరో నాని, నివాసం కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో ప్రముఖుల ఇళ్లపై ఐటీ సోదాలు జరుగుతుండటంతో నిర్మాతలు కంగారు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు, కెఎల్ నారాయణ ఇళ్ళు, ఆఫీసుల్లోనూ ఐటీ సోదాలు జరిగాయి.
కాగా, గత అక్టోబరు నెలలో ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. సంస్థ అధినేతలు నారయణదాస్, సునీల్ నారంగ్ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నైజాంలో భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు, ఏషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్ను కూడా ఈ సంస్థ నిర్మించింది.
బుధవారం నవంబర్20, ఉదయం నుంచి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఆఫీసు, నివాసంలోనూ, రామానాయుడు స్టూడియోలోను ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ కీలకమైన పత్రాలు కంప్యూటప్ హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అక్కడ లభించిన పత్రాలపై నిర్మాత సురేష్ బాబు నుంచి వివరణ తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సురేష్ బాబు చిన్న సినిమాలను పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ధియేటర్లను కూడా ఆయన సొంతంగా నడిపిస్తున్నారు. హైదరాబాద్ లో మొత్తం 10 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సోదాలపై మరింత సమాచారం అందాల్సి ఉంది.