Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు బుధవారం ఏపీలో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయంకు చేరుకోనున్న పవన్ 11 గంటలకు కోవిడ్ బారినపడి మృతి చెందినవారికి సంతాపం తెలియజేయనున్నారు. 12 గంటలకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొననున్న పవన్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ క్యాలెండర్ సహా పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది.
ఇక తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే కాగా దీనిపై నేడు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం పవన్ స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అనంతరం మధ్యాహ్నం నిరుద్యోగ యువత, భవన నిర్మాణ కార్మికులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
తిరుపతి ఉప ఎన్నిక పర్యటన తర్వాత పవన్ రాజకీయంగా అంతగా యాక్టివ్ గా లేరని రాజకీయ వర్గాలలో అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో నేడు పర్యటన ఆసక్తిగా మారింది. ఉప ఎన్నిక తర్వాత పవన్ కరోనా బారిన పడగా మహమ్మారి నుండి కోలుకోవడానికి దాదాపు నెల రోజులకు పైగా పట్టింది. అనంతరం కూడా పవన్ రాజకీయాలకు దూరంగా ఉండటంతో జనసేన పార్టీలోనూ పార్టీ నాయకులలో ఉత్సాహం తగ్గింది. ఇదే సమయంలో ఏపీలో రాజకీయ పరిస్థితి యాక్టివ్ గా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ మరోసారి తన గళం విప్పేందుకు సిద్దమైనట్లుగా కనిపిస్తుంది.