పవన్ కళ్యాణ్ కదలికలపై నిఘా : జనసేన ఆఫీసు వద్ద పోలీసుల మోహరింపు

  • Publish Date - January 20, 2020 / 12:36 PM IST

రాజధాని ప్రాంతం మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. పోలీసు ఉన్నతాధికారులు పవన్ కదలికలపై నిఘా వేశారు. అమరావతిలో పవన్ పర్యటించడానికి వీల్లేదని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసుల మోహరింపుపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాలోకి వెళ్లేందుకు పోలీసులను అనుమతించలేదు. 

రాజధానుల విషయంపై ప్రభుత్వ ప్రకటనతో పవన్ కళ్యాణ్ అధ్యక్షతనలో పీఏసీ అత్యవసరంగా సమావేశమైంది. ప్రభుత్వ ప్రకటన, రాజధానిలో నెలకొన్ని పరిస్థితులు, జనసేన ఎమ్మెల్యే రాపాక ఇచ్చిన స్పీచ్‌పై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనతో తీవ్ర నిరుత్సాహానికి, ఆవేదనకు గురైన రైతులను పరామర్శించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు.

అమరావతిలో పర్యటించేందుకు జనసేన ఏర్పాట్లు చేస్తోందని తెలుసుకున్న పోలీసులు ఆ పార్టీ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి లేకున్నా..పవన్ పర్యటించి..వారిని పరామర్శిస్తారని జనసేన నేతలు అంటున్నారు.

మూడు రాజధానుల విషయంలో ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. దీనిపై అసెంబ్లీ స్పష్టమైన ప్రకటన చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని జనసేనానీ తొలి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు అండగా ఉంటానని పవన్ హామీనిచ్చారు. అంతేగాకుండా..ఆ ప్రాంతాల్లో పవన్ పర్యటించారు కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

Read More : మూగబోయిన మైకులు : మున్సిపల్ ఎన్నికలు 22న ఓటింగ్