Janasena Party: శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్‌ఛార్జి వినూతపై బహిష్కరణ వేటు.. ఎందుకంటే..?

శ్రీకాళహస్తి నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న కోటా వినూతపై జనసేన పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది.

Vinutha Kota

Janasena Party: శ్రీకాళహస్తి నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న వినూత కోటాపై జనసేన పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. వినూతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

చెన్నైలో ఓ మురుగునీటి గుంతలో శ్రీకాళహస్తికి చెందిన యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు శవమై కనిపించాడు. అతను శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జి వినూత కోటా వద్ద వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్‌గా పనిచేశాడు. రాముడును హత్య చేసి కాలువలో పడేసినట్లు నిర్ధారణ అయింది. అయితే, ఈ హత్య కేసులో జనసేన నాయకురాలు వినూతను చెన్నై పోలీసులు నిందితురాలిగా చేర్చారు. ఆమెను అరెస్టు చేశారు.

ఈ కేసులో వినూత, ఆమె భర్తతోపాటు మరో ముగ్గురినీ చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాల కిందటే రాముడిని ఆమె విధుల నుంచి తొలగించారు. చెన్నై మింట్ పీఎస్ పరిధిలో కూవం నదిలో మూడు రోజుల క్రితం ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. చేతి మీద జనసేన సింబల్ తో పాటు వినూత పేరు ఉండటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వినూత, ఆమె భర్తతోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

జనసేన విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున వినూతను గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడమైందని, ఆమెపై చెన్నైలోని హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయని, ఈ క్రమంలో వినూత కోట ను పార్టీ నుంచి బహిష్కరించడమైందని జనసేన పార్టీ హెడ్ కాన్ఫిక్ట్ మేనేజ్మెంట్ వేముల పాటి అజయ్ కుమార్ పేరుపై ప్రకటన విడుదలైంది.