బీజేపీ- టీడీపీ- జనసేన పొత్తుపై జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్త ప్రకటన

Lok Sabha Elections 2024: నరేంద్ర మోదీ గత 10 సంవత్సరాలుగా దేశాభివృద్ధి ప్రగతి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని తెలిపారు.

Lok Sabha Elections 2024

బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై ఆయా పార్టీల అధినేతలు జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మోదీ, బీజేపీ, టీడీపీ, జనసేన దేశ ప్రగతికి, ఏపీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయన్నారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని చెప్పారు.

నరేంద్ర మోదీ గత 10 సంవత్సరాలుగా దేశాభివృద్ధి ప్రగతి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. బీజేపీతో టీడీపీ-జనసేన కలిసి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను చేరుకోవడానికి దోహదపడుతుందని చెప్పారు. 1996లో టీడీపీ ఎన్డీయేలో చేరిందని, వాజ్ పేయి, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కలిసి విజయవంతంగా పనిచేచేసిందని పేర్కొన్నారు.

2014లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేసిందని చెప్పారు. 2014 సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు జనసేన మద్దతు ఇచ్చిందని అన్నారు. సీట్ల పంపకానికి సంబంధించిన విధివిధానాలను ఒకటి రెండు రోజుల్లో చర్చించనున్నామని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల నిరీక్షణకు తగ్గట్టుగానే, వారి హృదయపూర్వకమైన ప్రజల మద్దతుతో కూటమి ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.

తెలుగుదేశం-బీజేపీ-జనసేన పొత్తుపై జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ఎన్డీఏ కూటమిలో చేరాలన్న చంద్రబాబు, పవన్ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని చెప్పారు. మోదీ నాయకత్వంలో టీడీపీ, తెలుగుదేశం, జనసేన దేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయని తెలిపారు.

Lok sabha Elections 2024: ఎన్నికల నగారా మోగేందుకు సమయం ఆసన్నమవుతోందా?