Brahmamgari Matam: మళ్లీ మొదటికే బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం
కడప జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక పీఠం శ్రీపోతులూరి వీరబ్రహ్మంగారి మఠ పీఠాధిపతి వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చింది. పీఠాధిపతి విషయంపై ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకున్నాకొలిక్కి రాలేదు
- Bharath Reddy
- Published On : January 3, 2022 / 12:07 PM IST
Braham
Brahmamgari Matam: కడప జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక పీఠం శ్రీపోతులూరి వీరబ్రహ్మంగారి మఠ పీఠాధిపతి వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చింది. పీఠాధిపతి ఎవరూ అనే విషయంపై ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకున్నా..ఇంకా కొలిక్కి రాలేదు. మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి అకాల మరణంతో పీఠాధిపతి స్థానం ఖాళీగా ఉంది. ఈ స్థానంపై దివంగత పీఠాధిపతి ఇద్దరు భార్యల కుమారులు పోటీపడుతున్నారు. గత కొన్నాళ్లుగా సాగిన ఈ వివాదంపై రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, పెద్దలు కలగజేసుకుని..మొదటి భార్య కుమారుడికే పీఠాధిపతీ స్థానం కట్టబెట్టారు. దీంతో పీఠాధిపతి వెంకటేశ్వరస్వామి..రెండవ భార్య మారుతీ మహాలక్ష్మి.. హై కోర్టుకు వెళ్ళింది. పీఠాధిపతి స్థానం తన కుమారుడికే దక్కేలా తన భర్త వీలునామా రాసిచ్చారంటూ కోర్టుకు వెళ్లగా, ఈ వ్యవహారంపై హై కోర్ట్ స్పందిస్తూ పీఠాధిపతిని నిర్ణయించే అధికారాలు తమ పరిధిలో లేవని.. తుదినిర్ణయం ధార్మిక పరిషత్ దేనని స్పష్టం చేసింది.
Also Read: Delhi Police: ఢిల్లీ గల్లీల్లో పోలీస్, డ్రగ్ స్మగ్లర్స్ వార్, ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి
దీంతో దేవాదాయశాఖ మంత్రిని కమిటీ చైర్మన్ గా, ఆశాఖ ముఖ్యకార్యదర్శి, కమీషనర్, టీటీడీ కార్యనిర్వహణ అధికారులను సభ్యులుగా పేర్కొంటూ కమిటీని ఏర్పాటు చేసారు. ధార్మిక పరిషత్ కమిటీ సభ్యులు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పీఠాధిపతిని నిర్ణయించేందుకు సిద్ధమయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ధార్మిక కమిటీ సభ్యులు వీలునామాను పరిగణలోకి తీసుకోవడం లేదంటూ.. రెండవ భార్య మారుతీ మహాలక్ష్మి హై కోర్టును ఆశ్రయించారు. వీలునామాను పరిగణలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో దేవాదాయ చట్టం సెక్షన్ 152 ప్రకారం ధార్మిక కమిటీలో 21 మంది సభ్యులు ఉండాల్సి ఉండగా.. 2021 నవంబర్ 22న చట్టసవరణ అనంతరం కమిటీ సభ్యులను నలుగురికి కుదించింది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read: Visakha RK Beach: ఆర్కే బీచ్ లో గల్లంతైన యుకులకోసం రెండో రోజు గాలింపు
సభ్యుల కుదింపుపై ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి..హైకోర్టులో పిల్ వేశారు. కమిటీ సభ్యుల కుదింపు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉందంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. చట్ట సవరణ ఆధారంగా పీఠాధిపతి నియామకంపై ముందుకు వెళ్లకుండా నిలువరించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. దీంతో పీఠాధిపతి వ్యవహారం కోలిక్కి వస్తుందనుకున్న నేపథ్యంలో… పిల్ వేయడం, హై కోర్ట్ స్టేఇవ్వడంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికే చేరింది. ఇక పీఠాధిపతి నియామకంపై జనవరి 5న బ్రహ్మంగారి మఠంలో పర్యటించాలని నిర్ణయించిన ధార్మిక పరిషత్ కమిటీ సభ్యులు.. వీరబ్రహ్మేంద్రస్వామి వారి వంశీకులను, మఠాధిపతులు, శిష్యులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇంతలోనే కోర్టు తీర్పు రావడంతో వీరి పర్యటన వాయిదా పడనుంది.
Also Read: Ragging Turmoil: సూర్యాపేటలో మెడికల్ విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం
