Jayamangala Venkata Ramana : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్ ను కలిశారు కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకటరమణ. స్థానిక సంస్థల కోటాలో వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు.
అధికార పార్టీలోనే కాదు ప్రతిపక్షంలోనూ అసంతృప్తులు ఉన్నారు. వారంతా పార్టీని వీడి బయటకు వెళ్తున్నారు. జయమంగళ వెంకట రమణ తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత. కైకలూరు మాజీ ఎమ్మెల్యే. ఆయన సైకిల్ దిగి ఫ్యాన్ గూటికి చేరారు.
కైకలూరు టీడీపీ ఇంచార్జిగా ఉన్న జయమంగళ వెంకట రమణ చాలా కాలం నుంచి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అవకాశం కోసం చూస్తున్న ఆయనకు వైసీపీ ఆఫర్ ప్రకటించిందని తెలుస్తోంది. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇవ్వడంతో వైసీపీలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపించారని సమాచారం.
వెంకటరమణను వైసీపీలోకి తీసుకురావడంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో వచ్చే నెలలో ఖాళీలు అయ్యే స్థానాలతో కలుపుకుని మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందలో ఒకటి వెంకటరమణకు ఇవ్వబోతున్నట్టు వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Also Read..Chandrababu Naidu : జగన్ ఓటమి ఖాయం, ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో కైకలూరు జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కైకలూరు నియోజకవర్గం గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తుల్లో భాగంగా టికెట్ ఇవ్వలేదు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్ గా లేరు. మరోవైపు ఆయన పనితీరు బాగోలేదని, ఆయనను కైకలూరు స్థానం నుంచి తప్పించే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.