Chandrababu Naidu : జగన్ ఓటమి ఖాయం, ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ ఓడిపోతాడని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయన్నారు చంద్రబాబు. అందుకే, జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని తెలిపారు.
Chandrababu Naidu : ముందస్తు ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఓడిపోతాడని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయన్నారు చంద్రబాబు. అందుకే, జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని తెలిపారు. ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవడం ఖాయమన్నారు చంద్రబాబు.
”సైకో చేతిలో రాష్ట్ర రాజధాని ఉంది. లేని అధికారాన్ని ఆపాదించుకుని రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారు. చేసే విధ్వంసాలను సరిదిద్దటం రాజ్యాంగ సంస్థలకు సైతం కష్టంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం ఆలోచించకుండా ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి అసత్యాలు మాట్లాడుతున్నారు.
విభజన చట్టం సెక్షన్ 5లో రాజధానిపై స్పష్టంగా ఉన్నా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. చట్టబద్ధంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తే ప్రధాని వచ్చి శంకుస్థాపన చేశారు. పార్లమెంట్ మొత్తం అమరావతికి అండగా ఉంటుందని శంకుస్థాపన రోజు ప్రధాని హామీ ఇచ్చారు” అని చంద్రబాబు అన్నారు. సైకో చేతిలో రాష్ట్ర రాజధాని పేరిట వివిధ సందర్భాల్లో అమరావతి పై జగన్ చేసిన ప్రసంగాల వీడియోని ప్రదర్శించిన చంద్రబాబు.. నిప్పులు చెరిగారు.(Chandrababu Naidu)
”జగన్.. మభ్యపెట్టడంలో దిట్ట, దోచుకోవటంలో అనకొండ. పెట్టుబడులన్నీ తరిమేసి ఏం ఒరగపెట్టడానికి విశాఖ వెళ్తున్నానని జగన్ చెబుతున్నారు? ఇప్పటికే రూ.45 వేల కోట్ల భూములు కాజేసి గంజాయి రాజధానిగా విశాఖను మార్చారు. పోలవరాన్ని నిర్వీర్యం చేసి గోదావరిలో ముంచేశారు. రుషికొండకు కూడా బోడిగుండు కొట్టించిన ఘనుడు. విభజన చట్టం వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన నష్టమే ఎక్కువ. విధ్వంసకర చర్యల వల్ల మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని చేశారు. రోజు గడిస్తే చాలన్నట్లు వైసీపీ ఎమ్మెల్యేలు బానిసల్లా బతుకుతున్నారు. ప్రజాక్షేత్రంలో జగన్ ని దోషిగా నిలబెట్టి తీరుతాం” అని నిప్పులు చెరిగారు చంద్రబాబు.
” ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అమరావతిపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని తేలింది. అమరావతిపై జగన్ వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది. ప్రజాజీవితం అంటే జగన్ రెడ్డికి అంత చులకనా? పిచ్చి కుక్క అని ముద్రవేసే రీతిలో అమరావతిపై దుష్ప్రచారం చేశారు. పైరవీల కోసం ఎంత నీచానికి దిగజారాలో అంత నీచంగా వ్యవహరించారు. అమరావతి నిర్మాణం ముందుకు సాగి ఉంటే పన్నుల రూపేణ రాష్ట్రమంతటికీ ఆదాయం వచ్చి ఉండేది. ప్రజా వేదికతో ప్రారంభమైన అమరావతి విధ్వంసం ఇప్పుడు రోడ్లు తవ్వేసే దాకా వచ్చింది. అంబేడ్కర్ విగ్రహాలను సైతం వదలకుండా విధ్వంసం సాగిస్తున్నారు” అని ధ్వజమెత్తారు చంద్రబాబు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.