Kakani Govardhan Reddy: 2, 3 నెలల్లో ఎన్నికలు వస్తాయి… ఆ తర్వాత..: మంత్రి కాకాణి
మొన్నటి వరకు ఆరోగ్యం బాగాలేదని చంద్రబాబు రకరకాల డ్రామాలు ఆడారని కాకాణి ఆరోపించారు. చంద్రబాబు జైలుకి వెళ్తే 150 మంది చనిపోయారని సిగ్గు లేకుండా..
- T Venkateshwarlu
- Published On : December 14, 2023 / 07:06 PM IST
minister Kakani govardhan Reddy
Michaung cyclone: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మిచౌంగ్ తుపాను హెచ్చరికలు వచ్చినా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చంద్రబాబు చేసిన విమర్శలకు కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
నెల్లూరులో కాకాణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… 2, 3 నెలల్లో ఎన్నికలు వస్తాయని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడి పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుందని అన్నారు. తుపాన్ వల్ల రైతులు నష్టపోయారని చంద్రబాబు అనడం దుర్మార్గమని చెప్పారు.
రైతుల్ని మోసం చేసింది చంద్రబాబు కాదా అని కాకాణి ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఏపీలో కరవు విలయతాండవం చేసిందని అన్నారు. హుద్హుద్ తుపాను సమయంలో చంద్రబాబు ఫొటోలకి పోజులిచ్చి వెళ్లిపోయారని ఆరోపించారు. కరవు మండలాలను ప్రకటించడం తప్ప రైతులకు చంద్రబాబు ఏమి చేశారో చెప్పాలని నిలదీశారు.
మొన్నటి వరకు ఆరోగ్యం బాగాలేదని చంద్రబాబు రకరకాల డ్రామాలు ఆడారని కాకాణి ఆరోపించారు. చంద్రబాబు జైలుకి వెళ్తే 150 మంది చనిపోయారని సిగ్గు లేకుండా టీడీపీ అబద్ధాలు చెబుతోందని అన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి పరిహారం చెల్లిస్తున్నామని కాకాణి చెప్పారు. 40 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు ఇస్తున్నామని అన్నారు. గతంలో మాటలు చెప్పడం, ఫొటోలకి పోజులు ఇవ్వడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని కాకాణి విమర్శించారు.
Pawan Kalyan : ఒక్కసారి జనసేనను నమ్మండి, మీకు అండగా ఉంటాను- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
