Godavari floods : గోదావరి వరదతో ఏపీలోని లంకలు, ఏజెన్సీ గ్రామాలు ఇంకా అంధకారంలో మగ్గిపోతున్నాయి. ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో 15 పంచాయతీల్లో దాదాపు పది వేల కుటుంబాలకుపైగా నిరాశ్రయులయ్యారు. భద్రాచలం వద్ద వరద నీటి మట్టం తగ్గుముఖం పట్టినా అక్కడినుంచి వచ్చే నీరంతా ఇవాళ దిగువకు చేరుకోనుంది. ఇంత పెద్ద వరద క్రమేపీ దగ్గరవుతున్న కొద్దీ ఇప్పటికే పూర్తిగా నీట మునిగిన ముంపు మండలాల్లో మరింత దారుణ పరిస్థితులు నెలకొనే ప్రమాదం పొంచి ఉంది.
వేలేరుపాడు మండలం యావత్తు దాదాపు ఇప్పటికే వరద నీటిలో మునిగింది. గోదావరి వరద సృష్టిస్తున్న జల ప్రళయంతో కోనసీమ జిల్లాలోని నదీ తీరగ్రామాల ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అత్యంత ప్రమాదకర స్థితిలో నదీ పాయలన్నీ ఏటిగట్ల పైనుంచి పొంగి ప్రవహిస్తున్నాయి. ఎక్కడికక్కడే గట్లు బలహీనపడి వరదనీరు లీకవుతున్నాయి. గౌతమీ, వృద్ధగౌతమీ, వైనతేయ, వశిష్ఠ నదీ పాయల వెంబడి ఉన్న ఏటిగట్లు ఆందోళనకర స్థితికి చేరాయి.
Heavy Rains : తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద అవుట్ఫాల్ స్లూయిజ్ నుంచి భారీగా వరద నీరు లీకవ్వడంతో పాత ఇంజరం, కొమరగిరి గ్రామాలు జలదిగ్బంధానికి గురయ్యాయి. పి.గన్నవరం మండలం నాగుల్లంక వద్ద వైనతేయ నది నుంచి నాలుగుచోట్ల నీరు లీకవుతోంది. వశిష్ఠ నది రాజోలు సమీపంలో గట్టు నుంచి పొంగి ప్రవహించడంతో తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి నిలువరించినప్పటికీ ఏ క్షణంలో ముప్పు వస్తుందోనని ప్రజలు హడలిపోతున్నారు.