Ttd Laddu
TTD Laddu Counters : తిరుమల అనగానే మనకు ముందుగా శ్రీవారితోపాటు ఆయనకు నైవేద్యంగా పెట్టే లడ్డూ గుర్తుకు వస్తుంది. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఈ లడ్డూకు ఉంది. స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైంది కాబట్టే.. ఈ లడ్డూను ఆయనకు నైవేద్యంగా పెడుతారు. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. లడ్డూ కేంద్రంలో KVM ఇన్ఫోకామ్ సంస్థ సేవలు ప్రారంభించింది.
ఇప్పటి వరకు పలు బ్యాంకుల ద్వారా లడ్డు విక్రయాలు జరిపేవారు. నాణ్యమైన సేవలను అందించేందుకే ప్రైవేటు సంస్థకు అప్పగించామని తెలిపారు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి. వీటితో పాటు వైకుంఠం టికెట్ల తనిఖీ కేంద్రం, సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని సైతం ఇకపై ప్రైవేటు ఏజెన్సీలే చేపట్టనున్నాయి. మరోవైపు…చాలాకాలం తర్వాత తిరుమలలో మళ్లీ భక్తుల సందడి నెలకొంది. కరోనా ఆంక్షల సడలింపులతో శ్రీనివాసుడి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
దీంతో శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిత్యం 12 నుంచి 18 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుoటున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం.. వర్చువల్ సేవా టికెట్లు కొన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఏప్రిల్ రెండో వారం నుంచి ఉచిత దర్శనాన్ని నిలిపివేసింది టీటీడీ. గత పది రోజుల్లో లక్షా 60 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. పది రోజుల్లో సుమారు 15 కోట్ల శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది.